అందరూ అనుకున్నదే జరిగింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిల చేతికి వచ్చాయి. ఈ మేరకు వైఎస్ షర్మిలను ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా ఏఐసీసీ అధికారికంగా నియమించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఏఐసీసీ ప్రకటించింది. ఇన్నిరోజులు గిడుగు రుద్రరాజు ఏపీ పీసీసీ చీఫ్గా ఉన్నారు. అయితే ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. ఈక్రమంలో రుద్రరాజు స్థానంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. అలాగే గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
అయితే తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాలు రావడంతో షర్మిల తెలంగాణకు వెళ్లారు. అక్కడ వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. పార్టీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటి కేసీఆర్ సర్కార్పై పెద్ద యుద్ధమే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర కూడా చేపట్టారు. పాదయాత్ర సమయంలోనే ఓసారి షర్మిల అరెస్ట్ అయ్యారు. అయితే అప్పటి వరకు కేసీఆర్ సర్కార్పై ఒంటికాలుపై లేసిన షర్మిల సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు సైలెంట్ అయిపోయారు.
అప్పట్లోనే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలొచ్చాయి. పలుమార్లు కాంగ్రెస్ హైకమాండ్తో కూడా షర్మిల చర్చలు జరిపారు. త్వరలోనే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ప్రకటించారు. కానీ చివరికి వచ్చే సరికి అది జరగలేదు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. షర్మిల కాంగ్రెస్కు మద్ధతిచ్చారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశారు. ఈక్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఆసన్నమవుతున్నవేళ మరోసారి కాంగ్రెస్ హైకమాండ్తో షర్మిల చర్చలు జరిపారు. ఈ మేరకు ఇటీవల ఢిల్లీకి వెళ్లి తన వైఎస్సార్ టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ సమయంలోనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఖర్గే.. షర్మిలకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈక్రమంలో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని.. ఏపీపీసీసీ చీఫ్గా నియమిస్తారని ముందు నుంచి కూడా ప్రచారం జరిగింది. ఇటీవల గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేయడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈక్రమంలో ఆ ప్రచారాన్నే నిజం చేస్తూ.. కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE