కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ నేతృత్వంలో దేశంలో కోవిడ్-19 మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 23వ సమావేశం గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులను, కరోనా వ్యాక్సినేషన్ ను మంత్రులు సమీక్షించారు. దేశంలో కరోనా నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఇప్పటికి ఒక సంవత్సరానికి పైగా పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి హర్ష్ వర్ధన్ గుర్తు చేశారు. దేశంలో మొదటి కేసు గత ఏడాది జనవరి 30 న నివేదించబడిందని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మొదటి సమావేశం ఫిబ్రవరి 3, 2020 న ఏర్పాటు చేయడమైందని అన్నారు. దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించగలిగామని, గత 24 గంటల్లో 12,000 కన్నా తక్కువ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు 1.73 లక్షలకు తగ్గాయని పేర్కొన్నారు.
గత 7 రోజుల నుండి 146 జిల్లాల్లో కొత్త కరోనా కేసులు లేవు:
గత 7 రోజుల నుండి 146 జిల్లాల్లో కొత్త కేసులు లేవు. అలాగే గత 14 రోజుల నుండి 18 జిల్లాల్లో, 21 రోజుల నుండి 6 జిల్లాల్లో మరియు గత 28 రోజుల నుండి 21 జిల్లాల్లో కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని మంత్రి పేర్కొన్నారు. ప్రో-యాక్టివ్ టెస్టింగ్తోనే ఇది సాధ్యపడిందని, ఇప్పటివరకు 19.5 కోట్లకు కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రస్తుత దేశంలో రోజువారీ కరోనా పరీక్ష సామర్థ్యం 12 లక్షలకు చేరిందన్నారు. కోటి మందికి పైగా వ్యక్తులు కోలుకోవడంతో, రికవరీ రేటు దాదాపు 97% కి చేరుకుందన్నారు.
70% యాక్టీవ్ కరోనా కేసులు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలోనే:
దేశంలో యాక్టీవ్ కరోనా కేసులలో 70% మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలోనే ఉన్నాయని తెలిపారు. ఇక యూకే కరోనా వేరియంట్ కేసులు దేశంలో 165 నమోదయ్యాయని, పాజిటివ్ గా తేలిన వారందరినీ కఠినమైన ప్రోటోకాల్స్ ప్రకారం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అలాగే గురువారం ఉదయానికి దేశవ్యాప్తంగా 42,674 సెషన్లలో 23,55,979 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్రమంత్రి హర్ష్ వర్ధన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ