అబార్షన్లపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి పెంపుకు జనవరి 29, బుధవారం నాడు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం గర్భధారణ నుంచి 20 వారాల సమయం వరకు మాత్రమే అబార్షన్లు చేయించుకునేందుకు అనుమతి ఉంది. అయితే ఇప్పుడు ఈ కాల పరిమితిని 24 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి 1971 చట్టానికి సవరణ చేస్తూ అబార్షన్ (సవరణ) బిల్లు-2020ను జనవరి 31 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. ఈ బిల్లుపై పలువురితో చర్చించామని, ఈ నిర్ణయం వలన మాతా మరణాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అబార్షన్ పరిమితిని 24 వారాలకు పెంచడం ద్వారా మహిళల పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టవుతుందని ఆయన తెలిపారు. అలాగే ఐదు నెలలు తర్వాత శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే గర్భవతులు అబార్షన్ పక్రియవైపు మొగ్గు చూపితే అనుమతికోసం కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని, ఇప్పుడు మరో నాలుగు వారాల కాలపరిమితిని పెంచడంతో అలాంటి వారి హక్కులను కూడా కాపాడినట్టు అవుతుందని పేర్కొన్నారు.
[subscribe]