అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి ఉండనుంది. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్య మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ట్రస్ట్లోని క్షేత్ర సభ్యుడు, ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 2024 జనవరిలో మకర సంక్రాంతి పర్వదినాన గర్భగుడిలో ‘రామ్ లల్లా’ (శ్రీరాముడు) విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం భక్తుల సందర్శనకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని, మొత్తం పురోగతి సంతృప్తికరంగా ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం మంగళవారం తెలిపింది.
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ను సిద్ధం చేస్తామని, 2024 జనవరి 14 నాటికి శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ఆయన చెప్పారు. ఇక రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్లు ఖర్చవుతుందని నిపుణుల కమిటీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అలాగే రామ మందిరం పరిసరాల్లోని 70 ఎకరాల విస్తీర్ణంలో వాల్మీకి, కేవట్, శబరి, జటాయువు, సీత, విఘ్నేశ్వరుడు (గణేష్), శేషావతార్ (లక్ష్మణుడు) ఆలయాలను కూడా నిర్మించనున్నారు. కాగా ఆమోద్య ఆలయ నిర్మాణ పనులను ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు. నవంబర్ 9, 2019 నాటి సుప్రీంకోర్టు తీర్పు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా.. 2020 ఆగస్టు 5న ఆలయ నిర్మాణానికి ప్రధాని ‘భూమి పూజ’ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY