ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు గానూ ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగుతుందని, అలాగే ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఢిల్లీలో మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు ఉండగా 13,750 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
ఈ రోజు(జనవరి 6) నుంచే ఢిల్లీలో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని సునీల్ అరోరా స్పష్టం చేశారు. కాగా ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుంది. 2015లో జరిగిన ఎన్నికలలో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) 70 సీట్లకు గాను 67 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్కసీటుకూడా దక్కించుకుకోలేకపోయింది. మరోవైపు కొన్ని నెలలక్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ పరిధిలోని 7 లోక్సభ స్థానాలను భారతీయ జనతా పార్టీ (భాజపా) గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ మరోసారి అధికారం దక్కించుకోవాలని భావిస్తుండగా, ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరేయాలని బీజేపీ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముఖ్య తేదీలు:
- ఎన్నికల నోటిఫికేషన్: జనవరి 14
- నామినేషన్ చివరి రోజు: జనవరి 21
- నామినేషన్ల పరిశీలన: జనవరి 22
- ఉపసంహరణ చివరి తేదీ: జనవరి 24
- ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 8
- లెక్కింపు తేదీ: ఫిబ్రవరి 11
[subscribe]