లోక్ సభ ఎన్నికలు త్వరలోనే వచ్చే అవకాశం ఉండడంతో అన్ని పార్టీల కన్నూ తెలంగాణపై పడింది. ఇక్కడున్న `17 సీట్లలో మెజారిటీ సీట్లు సాధించి.. కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పెద్దలు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నేతలతో భేటీలు నిర్వహిస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పటికే రాష్ట్ర నేతలతో లోక్ సభ ఎన్నికల విషయమై భేటీ అయిన కేంద్ర మంత్రి అమిత్ షా..మరోసారి ఎల్లుండి తెలంగాణకు రానున్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా నిన్న బూత్ లెవల్ కన్వీనర్లతో సమావేశం అయ్యారు. అతి త్వరలోనే మళ్లీ రాష్ట్రానికి వస్తానని, ఈలోగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఓప్లాన్ తో సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించినట్లు తెలిసింది. ఇక బీఆర్ ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటుపడకపోయినా, ఈరోజు పార్టీ పార్లమెంటరీ నేతలో భేటీ అయ్యారు.
తెలంగాణాలో మూడు ప్రధాన పార్టీలకూ లోక్ సభ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని, పోయిన ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. అందులోభాగంగా కేసీఆర్ కూడా పార్లమెంటుకు పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతోపాటే కేటీఆర్, హరీశ్ రావు కూడా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతారని తెలుస్తోంది. అగ్రనాయకులు పోటీ చేయడంవల్ల పార్టీ కేడర్ లో నూతనోత్సాహం వస్తుందనీ, పార్టీకి చెందిన మిగిలిన అభ్యర్థులు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారన్నది కేసీఆర్ వ్యూహం. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించకపోతే, క్యాడర్ నిరుత్సాహ పడటంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి దూకే ప్రమాదం లేకపోలేదని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ రంగంలోకి దిగారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్లో ఆ పార్టీ నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత తదితరులతో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, లోక్ సభ ఎన్నికల్లో పోటీపై నేతలతో చర్చించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా లోక్ సభ సీట్లనూ కైవసం చేసుకుని అధికారం సుస్థిరం చేసుకునే పనిలో ఉంది. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవల్ మీటింగ్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జు ఖర్గే హాజర్యారు. రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా చేయడమే కాంగ్రెస్ బూత్ లెవల్ మీటింగ్ లక్ష్యమని తెలిపారు. ఏఐసీసీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీనియర్ నాయకులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఆసక్తికరవ్యాఖ్యలు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదని, కానీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మన హామీలపై అసహనం వ్యక్తం చేస్తున్నాయన్నారు. హామీలపై అప్పుడే బిల్లా, రంగాలు ప్రశ్నిస్తున్నారని చురక అంటించారు.
చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకుంటే బిల్లా, రంగాలు ఊరూరు తిరుగుతూ పులి బయటకు వస్తుందని చెబుతున్నారని, కానీ పులి బయటకు వస్తే బోను రెడీగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి దోచుకున్నాం… మిమ్మల్ని అవమానించాం… మమ్మల్ని క్షమించండంటూ వారు తిరుగుతున్నారన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా వారి వైఖరి ఉందన్నారు. ఫిబ్రవరి నెలలో మరో రెండు హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మనం 14 స్థానాల్లో విజయం సాధించాలన్నారు. ఇక నుంచి తాను రోజు విడిచి రోజు తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. మన పోరాటంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని.. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుందన్నారు. కార్యకర్తలు చెమటోడ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని… పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి ఢిల్లీలోనూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువద్దామని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణలో పర్యటించనున్నారు బీజేపీ అగ్రనేత అమిత్షా. ఇప్పటికే పార్టీ తెలంగాణ నేతలతో ఆయన సమావేశం అయ్యారు. కొన్ని విషయాలపై నేతలకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు 28న తెలంగాణకు రానున్నారు. మహబూబ్నగర్, కరీంనగర్ లలో నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగే మహిళా సమ్మేళనానికి హాజరవుతారు. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే తెలంగాణలోని సీట్లు కీలకం అని భావించిన అధిష్ఠానం సీరియస్ గా దృష్టి సారించింది. ఇలా అన్ని పార్టీల అగ్రనేతలూ తెలంగాణలోని అసెంబ్లీ సీట్లు సాధించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. 2019 ఎన్నికల్లో 17 సీట్లకు గాను బీఆర్ ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 సాధించాయి. ఈ ఎన్నికల్లో ఆ లెక్కలు ఎలా మారనున్నాయో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE