భారత్-బంగ్లాదేశ్ మధ్య మీర్పూర్లో జరుగుతున్న రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శనివారం మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకు కుప్పకూలింది. తద్వారా టీమిండియా ముందు 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విధించింది. అయితే తక్కువ టార్గెట్ను ఛేదించే క్రమంలో భారత్ ఆట ముగిసే సమయానికి 45 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. భారత్ విజయం సాధించాలంటే మరో 100 పరుగులు చేయాల్సి ఉండగా.. బంగ్లాదేశ్ గెలవాలంటే 6 వికెట్లు తీయాల్సి ఉంది. దీంతో రోజుకో మలుపు తిరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇక రెండు టెస్ట్ల సిరీస్లో మొదటి టెస్ట్ గెలుచుకున్న భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
టార్గెట్ చిన్నదే అయినా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసిన టీమిండియా ఛేదనలో తడబడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (2), శుభ్మన్ గిల్ (7), ఛటేశ్వర్ పుజారా (6) రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇక స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అయితే ఏకంగా డకౌట్ కావడం విశేషం. ప్రస్తుతం నైట్ వాచ్మెన్గా వచ్చిన అక్షర్ పటేల్ 26 పరుగులతో, జయదేవ్ ఉనద్కత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు బంగ్లా బ్యాట్స్మెన్స్లో లిటన్ దాస్ 73 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జకీర్ హసన్ 51 రన్స్ సాధించాడు. అలాగే నురుల్ హసన్, టాస్కిన్ అహ్మద్ తలో 31 పరుగులు చేశారు. ఇక ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, సిరాజ్, అశ్విన్ తలో రెండు వికెట్లు తీయగా.. ఉమేశ్, జయదేవ్లకు ఒక్కో వికెట్ దక్కింది. కాగా మొదటి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 227 పరుగులు చేయగా.. ఇండియా 314 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ