ఐపీఎల్-16 సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఘనవిజయం సాధించింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ.. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన పోరులో చివరకు ధోనీ సేనదే పైచేయి అయింది. వరుణుడి ఆటంకం మధ్య డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలిన పోరులో చెన్నై 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ను మట్టి కరిపించింది. తద్వారా ఐదోసారి ఐపీఎల్ కప్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. బెస్ట్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చివరి రెండు బంతులకు 6, 4 కొట్టి ఒంటిచేత్తో చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడు.
ఇక వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్ సోమవారానికి వాయిదా పడగా.. రిజర్వ్ డే రోజు కూడా కొద్దిసేపు వర్షం మ్యాచ్కు అడ్డుపడింది. కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్లు సాహా 54 పరుగులు, గిల్ 39 పరుగులతో రాణించారు. ఈ టోర్నీలో 3 సెంచరీలతో ఫుల్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ వికెట్ల వెనుక ధోనీ చేసిన మెరుపు స్టంపింగ్తో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం సాయి సుదర్శన్ చెలరేగి ఆడి 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 పరుగు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
ఈ క్రమంలో చివరి ఓవర్లో చెన్నై విజయానికి పదమూడు పరుగులు అవసరం కాగా.. మోహిత్ అద్భుతంగ బౌలింగ్ చేసి తొలి నాలుగు బంతులకు మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరం అయ్యాయి. ఈ తరుణంలో అందరూ గుజరాత్ గెలుపు ఖాయమేనని భావించారు. అయితే జడేజా క్రీజులో ఉండటంతో చెన్నై అభిమానులు కొద్దిపాటి ఆశతో ఉన్నారు. వారి ఆశలను నిజం చేస్తూ జడేజా చెలరేగి ఐదో బంతికి సిక్స్, ఆరో బాల్కు ఫోర్ కొట్టి చెన్నై అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. జడేజా ఆరు బాల్స్లో ఒక సిక్సర్, ఒక ఫోర్తో 15 రన్స్ చేయగా, శివమ్ దూబే 21 బాల్స్లో రెండు సిక్సర్లతో 32 రన్స్తో నాటౌట్గా మిగిలాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు, నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీసుకున్నారు.
సంక్షిప్త స్కోరు వివరాలు
గుజరాత్: 214/4 (సుదర్శన్ 96, సాహా 54; పతిరణ 2/44, జడేజా 1/38),
చెన్నై: 171/5 (కాన్వే 47, దూబే 32 నాటౌట్; మోహిత్ 3/36, నూర్ 2/17).
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE