భారత్-న్యూజిలాండ్ మధ్య సెడాన్ పార్క్ వేదికగా జనవరి 29, బుధవారం నాడు జరిగిన మూడో టీ20లో సూపర్ ఓవర్ ద్వారా భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ ఓడిపోయి మొదటగా బ్యాటింగ్ చేసి భారత్ 179 పరుగులు చేయగా, లక్ష్యసాధనలో న్యూజిలాండ్ సైతం 179 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్ నిర్వహించగా న్యూజిలాండ్ నిర్దేశించిన 18 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. ఉత్కంఠ రేపిన సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ విజృభించడంతో భారత్ 20 పరుగులు చేసింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో మరో రెండు మ్యాచులు మిగులుండగానే 3-0తో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ(65: 6×,4 3×6) పరుగులతో వేగంగా ఆడగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (27: 2×4, 1×6) పరుగులతో రాణించాడు. వన్ డౌన్ లో వచ్చిన శివమ్ దూబే 3 పరుగులకే వెనుదిరగగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (38: 2×4, 1×6) పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. శ్రేయాస్ అయ్యర్ (17), మనీశ్ పాండే (14), రవీంద్ర జడేజా (10) పరుగులతో వారి వంతు సహకారం అందించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్ బెన్నెట్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇక 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు గుప్తిల్ (31) శుభారంభాన్ని ఇచ్చాడు. గుప్తిల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ తన శైలికి భిన్నంగా మొదటినుంచే భారత్ బౌలర్లుపై విరుచుకుపడ్డాడు. సహచర ఆటగాళ్ల వికెట్లు వరుసగా పడుతున్న 48 బంతుల్లో 95 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. విలియమ్సన్ దూకుడుకు భారత్ మ్యాచ్ కోల్పోయే స్థితికి చేరుకోగా చివరి ఓవర్లో బౌలర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో న్యూజిలాండ్ గెలుపుకు 9 పరుగులు అవసరంకాగా మూడో బంతికి విలియమ్సన్ ను, చివరి బంతికి రాస్ టేలర్ ను షమీ అవుట్ చేయడంతో మ్యాచ్ టైగా మారింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సూపర్ ఓవర్లో విలియమ్సన్, గుప్తిల్ బ్యాటింగ్ కు వచ్చి బుమ్రా బౌలింగ్ లో 17 పరుగులు చేశారు. అలాగే భారత్ తరుపున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేసి టిమ్ సౌతీ బౌలింగ్ లో 20 పరుగులు చేయడంతో ఉత్కంఠ మ్యాచ్ లో భారత్ జట్టు ఘనవిజయాన్ని అందుకుంది.