కర్ణాటక అసెంబ్లీకి రేపు (బుధవారం, మే 10, 2023) ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 224 స్థానాలు కలిగిన అసెంబ్లీలో 2613 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.24 కోట్లకు పైగా ఉండగా.. వీరిలో 2.62 కోట్ల మంది పురుషులు, మరో 2.6 కోట్ల మంది వరకు మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక దేశంలోనే తొలిసారిగా 80 ఏళ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటేసే సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ నెల 13న ఫలితాలు వెలువడనున్నాయి.
బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహించగా.. కాంగ్రెస్ తరపున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, రణదీప్ సూర్జేవాలా తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక బీజేపీ తరపున ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు మాజీ సీఎం యడియూరప్ప తదితరులు ప్రధానంగా ఎన్నికల భారాన్ని మోయగా.. కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తదితరులు ముందుండి పార్టీ శ్రేణులను నడిపారు. మరోవైపు జేడీఎస్ తరపున ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడతో పాటు మాజీ సీఎం కుమార స్వామి తమకు పట్టున్న ప్రాంతాల్లో ప్రచారం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE