కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కు ఎదురైంది. ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేదానిపై పార్టీ అధిష్టానానికి సమస్య ఉత్పన్నం అయింది. అయితే కీలక పదవి కోసం మాజీ సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో సీఎల్పీ నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ ఆదివారం ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులోని షాంగ్రిలా హోటల్లో జరిగిన ఈ సీఎల్పీ భేటీకి అధిష్టానం దూతగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే హాజరయ్యారు. అలాగే ఆయనతో పాటు మరో ఇద్దరు పరిశీలకులు దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్లను పరిశీలకులుగా వచ్చారు. ఇక ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా మరియు కేసీ వేణుగోపాల్ తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 135 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని వారు సేకరించారు.
ఇక ఈ సందర్భంగా చేరి రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని వచ్చిన ఒక సూచనకు సిద్దరామయ్య అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనకు శివకుమార్ సంసిద్ధత వ్యక్తం చేయలేదని, దీనిని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యేలు అందరూ ఈ సందర్భంగా ఏకవాక్య తీర్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని షిండే బృందం నిశ్చయించుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ప్రకటించే నిర్ణయానికి పార్టీ ఎమ్మెల్యేలు అందరు కట్టుబడి ఉండాలని దూతలు స్పష్టం చేశారు. మరోవైపు హోటల్ బయట అటు సిద్దరామయ్య మద్దతుదారులు, ఇటు డీకే శివకుమార్ అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేయడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE