భారత దిగ్గజ స్ప్రింటర్, ఫ్లయింగ్ సిఖ్గా పేరు గాంచిన మిల్కాసింగ్ (91) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మే 20వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో జూన్ 3న చండీగర్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎంఆర్) లో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కరోనా అనంతర సమస్యల కారణంగా శుక్రవారం అర్ధరాత్రి 11.30 కు మిల్కా సింగ్ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు మిల్కాసింగ్ సతీమణి నిర్మల్ కౌర్ కూడా కరోనాబారిన పడి జూన్ 14న మృతి చెందారు. దీంతో మిల్కాసింగ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
నవంబర్ 20, 1932న పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న గోవింద్పురలో సిక్రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో మిల్కాసింగ్ జన్మించారు. 1951లో భారత సైన్యంలో చేరారు. అనంతరం అథ్లెట్గా మారిన మిల్కాసింగ్ ఎంతో ఘనతను సాధించాడు. ఆసియా గేమ్స్ తో పాటు కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల రేసులో స్వర్ణం సాధించిన ఏకైక అథ్లెట్ గా నిలిచాడు. 1958 మరియు 1962 ఆసియా గేమ్స్ లో మొత్తం నాలుగు స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు. 1958 కామన్వెల్త్ గేమ్స్లో కూడా స్వర్ణం గెలిచి సత్తా చాటాడు. 1960 రోమ్ లో ఒలింపిక్స్లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు.
ఇక మెల్ బోర్న్1956 సమ్మర్ ఒలింపిక్స్, రోమ్ 1960 సమ్మర్ ఒలింపిక్స్ మరియు టోక్యోలో జరిగిన 1964 సమ్మర్ ఒలింపిక్స్ లో భారతదేశం తరపున మిల్కాసింగ్ ప్రాతినిధ్యం వహించాడు. మిల్కాసింగ్ సాధించిన క్రీడా విజయాలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. భారతదేశ క్రీడాచరిత్రలో మిల్కాసింగ్ గొప్ప కీర్తి గడించారు. మిల్కాసింగ్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, క్రీడా, సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ