ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో వేగంగా విస్తరిస్తున్న ‘మంకీపాక్స్’ ఇప్పుడు భారత్లో కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక 5 ఏళ్ల చిన్నారి ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. పాప శరీరంపై దద్దుర్లు, దురద ఉన్నట్లు వారు గుర్తించారు. దీంతో ఆ పాప నుంచి శాంపిల్స్ సేకరించి పూణేలోని ల్యాబ్కు టెస్ట్ కోసం పంపినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. అయితే ఆ పాపకు ఇతర ఆరోగ్య సమస్యలు లేవు, అంతేకాక చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, గత నెల కాలంలో పాప కుటుంబం కానీ, వారి సన్నిహితులు కానీ ఎవరూ విదేశాలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. కానీ, లక్షణాలను పరిశీలించిన మీదట ముందు జాగ్రత్త చర్యగా శాంపిల్ను ల్యాబ్కు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.
కాగా ప్రపంచ దేశాలలో మంకీపాక్స్ వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు కానప్పటికీ, ఇతర దేశాలలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా, భారతదేశం సిద్ధంగా ఉండాలని అందులో పేర్కొంది. అయితే మరోవైపు ఫ్రాన్స్లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. కాగా, ఫ్రాన్స్లో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో నమోదు అయింది. ఇక, జూన్ నాటికి ఈ కేసుల సంఖ్య 100ను దాటింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఇప్పటివరకు 20కి పైగా దేశాలలో 700 కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనే 11 రాష్ట్రాలలో 77 కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF