దేశంలో రైతులు, పరిశ్రమల్లోని కార్మికులతో పాటు, ఆరోగ్య రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాన సంస్కరణలను ఇటీవల ప్రవేశపెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సంస్కరణలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు కేవలం వాటిని వ్యతిరేకించాలనే భావనతోనే చేయడం శోచనీయమని ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని దశాబ్దాల తరబడి ఏలినవారు దేశంలో శ్రామికులు, యువత, రైతులు మరియు మహిళలకు సాధికారతను కల్పించడం పట్ల ఎన్నడూ శ్రద్ధ వహించలేదని, ఈ వ్యక్తులు రైతులు పండించిన పంటలను ఒక లాభసాటి ధరకు దేశంలో ఎవరికైనా, ఎక్కడైనా విక్రయించడకూడని కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ‘నమామి గంగే మిషన్’ లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ లో 6 మెగా అభివృద్ధి పథకాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.
జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, డిజిటల్ ఇండియా ప్రచారోద్యమం, అంతర్జాతీయ యోగ దినం వంటి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రజలకు విస్తృత ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ కూడా ఆయా కార్యక్రమాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ఇదే వ్యక్తులు వాయుసేన ఆధునీకరణను, వాయుసేనకు అధునాతన యుద్ధ విమానాలను అందించడాన్ని కూడా వ్యతిరేకించారని ఆయన అన్నారు. ఇదే వ్యక్తులు ప్రభుత్వ ‘ఒక ర్యాంకు, ఒక పింఛన్’ విధానాన్ని సైతం వ్యతిరేకించారని, అయితే ప్రభుత్వం సాయుధ దళాల పింఛనుదారులకు బకాయిల రూపంలో 11,000 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటికే చెల్లించిందని ఆయన చెప్పారు. సర్జికల్ స్ట్రయిక్ ను సైతం విమర్శించారని, సర్జికల్ స్ట్రయిక్ జరిగినట్లు రుజువు చేయాలని సైనికులను అడిగారని అన్నారు. ఇది వారి వాస్తవ ఉద్దేశ్యాలు ఏమిటో యావత్తు దేశానికి తేటతెల్లం చేసిందని చెప్పారు. కాలం గడిచే కొద్దీ వ్యతిరేకించే వారు మరియు నిరసన తెలిపేవారు అసంబద్ధంగా మారిపోతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu