ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఇటానగర్లోని డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచడంలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా ‘డోనీ పోలో ఎయిర్పోర్ట్, ఇటానగర్’ నిర్మించబడింది. ఈ విమానాశ్రయాన్ని రూ.640 కోట్ల వ్యయంతో 690 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించారు. 2019 ఫిబ్రవరిలో ఈ విమానాశ్రయానికి స్వయంగా ప్రధాని మోదీనే శంకుస్థాపన చేశారు. మధ్యమధ్యలో కరోనా మహమ్మారి కారణంగా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తక్కువ వ్యవధిలోనే ఈ డోనీ పోలో విమానాశ్రయం పనులు పూర్తయ్యాయి.
అనంతరం 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఇది రూ.8450 కోట్లకుపైగా వ్యయంతో అభివృద్ధి చేయబడగా, అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలో 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా కందు, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బిడి మిశ్రా మరియు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, అరుణాచల్ ప్రజలు తమ రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేస్తున్నారని కొనియాడారు. స్వాతంత్య్రానంతర కాలంలో ఈశాన్య ప్రాంతం ఉదాసీనత మరియు నిర్లక్ష్యానికి గురైందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వమేనని ప్రధాని అన్నారు. తరువాత, ఆ ఊపు పోయింది కానీ 2014 తర్వాత అభివృద్ధి యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. “ఇంతకుముందు, మారుమూల సరిహద్దు గ్రామాలను చివరి గ్రామంగా పరిగణించేవారు. ‘సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలను దేశంలోనే తొలి గ్రామంగా పరిగణిస్తూ మా ప్రభుత్వం పని చేసింది” అని పేర్కొన్నారు. “పర్యాటకం లేదా వాణిజ్యం, టెలికాం లేదా టెక్స్ట్ టైల్స్ కావచ్చు ఈశాన్య ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది. డ్రోన్ టెక్నాలజీ అయినా, కృషి ఉడాన్ అయినా, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అయినా, పోర్ట్ కనెక్టివిటీ అయినా, ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుంది” అని తెలిపారు.
డోనీ పోలో ఎయిర్పోర్ట్ అరుణాచల్ ప్రదేశ్కి నాల్గవ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుందని, ఈశాన్య ప్రాంతంలోని మొత్తం ఎయిర్పోర్ట్ కౌంట్ 16కి చేరుకుందని ప్రధాని అన్నారు. 1947 నుండి 2014 వరకు ఈశాన్య ప్రాంతంలో కేవలం 9 విమానాశ్రయాలు మాత్రమే నిర్మించబడ్డాయని, గత ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో ఈశాన్య ప్రాంతంలో 7 విమానాశ్రయాలను నిర్మించామన్నారు. డోనీ పోలో విమానాశ్రయం అరుణాచల్ ప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతికి సాక్షిగా మారుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. విమానాశ్రయానికి పేరు పెట్టడాన్ని ప్రధాని వివరిస్తూ, ‘డోనీ’ అంటే సూర్యుడు, ‘పోలో’ అంటే చంద్రుడు అని వివరించారు. అరుణాచల్ ప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని హైలైట్ చేస్తూ, మారుమూల, దుర్గమ ప్రాంతాలలో హైవే నిర్మాణాన్ని ప్రధాని ఉదాహరణగా చెప్పారు. సమీప భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం మరో 50,000 కోట్ల రూపాయలు వెచ్చించబోతోందని, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE