ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భారతదేశ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నూతన భవనానికి సంబంధించిన స్మారక ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం లోక్సభ స్పీకర్ స్థానానికి సమీపంలో చారిత్రాత్మకమైన ‘సెంగోల్’ అనే రాజదండాన్ని ఏర్పాటు చేశారు. 1947లో అధికార బదిలీకి చిహ్నంగా భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ బ్రిటీష్ చివరి వైశ్రాయ్ నుంచి లాంఛనంగా సెంగోల్ను అందుకున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమిత్ మిశ్రా, కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. కాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలివరుసలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పక్కన కూర్చున్నారు. ఇక ఈ కార్యక్రమానికి 25 పార్టీలు హాజరుకాగా.. మరో 20 ప్రతిపక్ష పార్టీలు గైర్హాజరయ్యాయి. త్వరలో పార్లమెంట్లో ఎంపీల సంఖ్య పెరగనుందని, అందుకే నూతన భవనం అవసరం అయిందని తెలిపారు. ఈ సందర్బంగా నూతన పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ తన తొలి ప్రసంగం చేశారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ అన్నారు.. ‘కొత్త పార్లమెంట్ భారతదేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది. ప్రజాస్వామ్యమే మన సంస్కారం, ఆలోచన, సంప్రదాయం. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు, కలలకు పార్లమెంట్ నూతన భవనం ప్రతిబింబం. ఏక్ భారత్.. ఏక్ శ్రేష్ఠ భారత్ను ఈ భవనం ప్రతిబింబిస్తోంది. ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది భారత్. భారత్తో పాటు ప్రపంచ అభివృద్ధికి కూడా ఈ పార్లమెంట్ కొత్త భవనం దోహదపడుతుంది. భారత్ అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా అభివృద్ధి అవుతుంది. చోళ రాజవంశంలో న్యాయం, ధర్మం, సుపరిపాలనకు సెంగోల్ ప్రతీక. చారిత్రక సెంగోల్ గౌరవాన్ని పునరుద్ధరించడం మా అదృష్టం. ఈ సభలో కార్యాకలాపాలు జరిగినప్పుడల్లా సెంగోల్ మాకు స్ఫూర్తినిస్తుంది. రానున్న కాలంలో పార్లమెంట్లో సీట్ల సంఖ్య, ఎంపీల సంఖ్య పెరగనుంది. ఆ అవసరం కోసమే కొత్త పార్లమెంట్ను నిర్మించాం. ఈ పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంలో దాదాపు 60 వేల మంది పాల్గొన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఓ డిజిటల్ గ్యాలరీని కూడా నిర్మించాం. ఇకనుంచి ఈ కొత్త పార్లమెంట్ ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనంగా, భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది’ అని పేర్కొన్నారు.
కాగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభానికి గుర్తుగా ప్రధాని మోదీ రూ.75 నాణేన్ని మరియు ప్రత్యేక స్టాంప్ను ఆవిష్కరించారు. రూ.75 నాణెం ఒకవైపున మధ్యలో ఆశోక స్థూపంలో ఉండే సింహాల గుర్తు ఉంది. దాని కింద ‘సత్యేమేవ జయతే’ అని రాసి ఉంది. అశోక స్తంభానికి ఎడమ వైపున దేవనాగరి లిపిలో ‘భారత్’ అని, కుడి అంచున ‘ఇండియా’ అనే పదం ఉంది. సింహాల గుర్తు కింద 75 అని నాణెం విలువను సూచించే ‘75’ సంఖ్య ఉంది. నాణేనికి రెండో వైపున పార్లమెంటు నూతన భవనం చిత్రం ఉంది. ఆ చిత్రంపైన ‘సన్సి సన్కుల్’ అని దేవనాగరి లిపిలో ఉంది. ఇక ఆ చిత్రం కింద ‘పార్లమెంట్ కాంప్లెక్స్’, దాని కింద 2023 అని రాసి ఉంది. ఇక ఈ నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్లతో ఈ నాణెం తయారైంది. ఈ నాణెం చుట్టూ 200 వంకీలు ఉన్నాయి. మొత్తంగా ఈ నాణెం బరువు 35 గ్రాములుగా ఉంది. అయితే ఇది ప్రత్యేక నాణెం కాబట్టి చెలామణిలో ఉండదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE