బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధేనని, ఎంతమాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలు కాదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురువారం ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ క్రమంలో యాదగిరి, కలబురగి జిల్లాల్లో దాదాపు ₹10,800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యాదగిరిలోని కోడెకల్లో జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్ కింద బహుళ గ్రామాల తాగునీటి సరఫరా పథకం వంటి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవం చేశారు. దీనిలో భాగంగా సుమారు రూ. 2,000 కోట్లతో నిర్మించనున్న సూరత్-చెన్నై ఎక్స్ప్రెస్వేలో భాగమైన 6-లేన్ గ్రీన్ఫీల్డ్ రోడ్ ప్రాజెక్ట్ – 65.5 కి.మీ సెక్షన్ నేషనల్ హైవే 150సీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే యాదగిరిలో నారాయణపూర్ ఎడమ గట్టు కాలువ పొడిగింపు, పునరుద్ధరణ, ఆధునీకరణ తదితర పనులను ప్రారంభించారు. కాగా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ కర్ణాటక రాష్ట్రంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అంతకుముందు జనవరి 12న హుబ్బళ్లిలో జరిగిన జాతీయ యువజనోత్సవానికి ఆయన చివరిసారిగా కర్ణాటక వెళ్లారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఉత్తర కర్ణాటకలో అభివృద్ధి జరుగుతున్న తీరు ప్రశంసనీయం. బిజెపి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోంది. రహదారి ప్రాజెక్ట్ ఉత్తర కర్ణాటకలో కనెక్టివిటీ సమస్యలను తొలగిస్తుంది, ఇది ప్రతి వ్యక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందున, రాబోయే కాలంలో మరింత బలమైన స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. రానున్న 25 ఏళ్లు ప్రతి పౌరుడికి, రాష్ట్రానికి చాలా ప్రధానం. ఈ కాలంలో మనం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి. పొలాల్లో మంచి పంటలు పండినప్పుడు మరియు పరిశ్రమలు కూడా విస్తరించినప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇక యాదగిరి, ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించి గత ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నాయి. ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వం, అందువల్ల డబుల్ సంక్షేమం జరుగుతుంది. దీని వల్ల కర్ణాటక ఎంత లాభపడుతుందో చూడాలని ఉంది’ అని వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE