ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (నవంబర్ 19, శనివారం) అరుణాచల్ ప్రదేశ్ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శనివారం ఉదయం 9:30 గంటలకు ఇటానగర్లోని డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈశాన్య ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచడంలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా ‘డోనీ పోలో ఎయిర్పోర్ట్, ఇటానగర్’ నిర్మించబడింది. ఈ విమానాశ్రయాన్ని రూ.640 కోట్ల వ్యయంతో 690 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించారు. 2300 మీటర్ల రన్వేతో ఈ విమానాశ్రయం అన్ని వాతావరణ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అనంతరం 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇది 8450 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయబడగా, అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలో 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుస్తుందని పేర్కొన్నారు.
ఆ తర్వాత ప్రధాని మోదీ ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసికి చేరుకుని, అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు ‘కాశీ తమిళ సంగమం’ ను ప్రారంభించనున్నారు. వారణాసిలో నవంబర్ 19 నుంచి నెల రోజులపాటుగా ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమం నిర్వహించబడనుంది. దేశంలోని అత్యంత ముఖ్యమైన మరియు పురాతనమైన రెండు స్థానాలైన తమిళనాడు మరియు కాశీ మధ్య పురాతన సంబంధాలను జరుపుకోవడం, పునరుద్ఘాటించడం మరియు తిరిగి కనుగొనడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రెండు ప్రాంతాలకు చెందిన పండితులు, విద్యార్థులు, తత్వవేత్తలు, వ్యాపారులు, కళాకారులు మొదలైన అన్ని వర్గాల ప్రజలు ఒకచోట చేరడానికి, వారి జ్ఞానం, సంస్కృతి మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి అవకాశం, ఒకరి అనుభవం నుండి మరొకరు నేర్చుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. తమిళనాడు నుంచి 2500 మందికిపైగా ప్రతినిధులు కాశీని సందర్శించనున్నారని, వారు సెమినార్లు, సైట్ సందర్శనలు మొదలైనవాటిలో సారూప్య వాణిజ్యం, వృత్తి మరియు ఆసక్తి ఉన్న స్థానిక వ్యక్తులతో ఇంటరాక్ట్ కానున్నారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE