ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 24, 25 తేదీలలో రెండు రోజుల పాటుగా ప్రధాని మోదీ అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 24న అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగే క్వాడ్రిలేటరల్ ఫ్రేమ్వర్క్ లీడర్స్ సమ్మిట్లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా పాల్గొననున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 12, 2021న క్వాడ్ నేతల మధ్య జరిగిన మొదటి వర్చువల్ సమ్మిట్ నుండి సాధించిన పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అలాగే భాగస్వామ్య ఆసక్తి ఉన్న ప్రాంతీయ సమస్యలపై నలుగురు నాయకులు చర్చించనున్నారు.
ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, వారు ఈ సంవత్సరం మార్చిలో ప్రకటించిన క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ పై సమీక్ష జరుపుతారు. ఇక క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలిజీఎస్, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ, సముద్ర భద్రత, మానవతా సహాయం/విపత్తు ఉపశమనం, వాతావరణ మార్పు మరియు విద్య వంటి సమకాలీన ప్రపంచ సమస్యలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకోనున్నారని తెలిపారు.
మరోవైపు సెప్టెంబర్ 25న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ లో ఉన్నత-స్థాయి విభాగం యొక్క జనరల్ డిబేట్ లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సంవత్సరం జనరల్ డిబేట్ యొక్క థీమ్ ను కోవిడ్-19 నుండి కోలుకోవడం, నిలకడగా పునర్నిర్మించడం, ప్లానెట్ యొక్క అవసరాలకు ప్రతిస్పందించడం, ప్రజల హక్కులను గౌరవించడం మరియు ఐక్యరాజ్య సమితిని పునరుజ్జీవింపజేయడం వంటివిగా నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ