ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క పన్నెండవ విడత నిధులు అక్టోబర్ 17, సోమవారం విడుదల కానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటుగా జరిగే “పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్-2022”ను అక్టోబర్ 17వ తేదీ ఉదయం 11:30 గంటలకు న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు లబ్ధికలిగేలా పీఎం-కిసాన్ 12వ విడత కింద రూ.16,000 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు.
ముందుగా ఫిబ్రవరి 24, 2019న పీఎం-కిసాన్ పథకాన్ని ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. అప్పటినుంచి దేశంలో అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరంలో నాలుగునెలలకోసారి మూడు సమానమైన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బును నేరుగా జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ యొక్క 12వ విడత కింద ప్రధాని మోదీ అక్టోబర్ 17న రూ.16,000 కోట్ల నిధులను విడుదల చేసి, అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున నేరుగా జమ చేయనున్నారు.
మరోవైపు అక్టోబర్ 17న న్యూఢిల్లీలో జరిగే పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్-2022 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 13,500 మంది రైతులు మరియు దాదాపు 1500 అగ్రి స్టార్టప్లు పాల్గొననున్నాయి. అలాగే వివిధ సంస్థల నుండి 1 కోటి మందికి పైగా రైతులు ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సమ్మేళన్ కు పరిశోధకులు, విధాన రూపకర్తలు మరియు ఇతర వాటాదారులు కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 600 ప్రదాన్ మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను (పీఎంకేఎస్కే) ప్రధాని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద దేశంలోని ఎరువుల రిటైల్ దుకాణాలు దశలవారీగా పీఎంకేఎస్కేలుగా మార్చబడతాయి. పీఎంకేఎస్కేలు రైతుల యొక్క అనేక రకాల అవసరాలను తీర్చడంతో పాటుగా, వ్యవసాయ-ఇన్పుట్లను (ఎరువులు, విత్తనాలు, పనిముట్లు) అందిస్తుందని చెప్పారు. అదేవిధంగా నేల, విత్తనాలు, ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలు, రైతులకు అవగాహన కల్పించడం, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం మరియు బ్లాక్/జిల్లా స్థాయి అవుట్లెట్లలో రిటైలర్ల క్రమబద్ధమైన సామర్థ్యాన్ని పెంచేలా చేస్తాయన్నారు. 3.3 లక్షలకు పైగా రిటైల్ ఎరువుల దుకాణాలను పీఎంకేఎస్కేలుగా మార్చడానికి ప్రణాళిక చేయబడిందని తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద భారత్ యూరియా బ్యాగ్లను ప్రధాని ప్రారంభిస్తారు, ఇది కంపెనీలకు “భారత్” అనే ఒకే బ్రాండ్ పేరుతో ఎరువులను మార్కెట్ చేయడానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎరువులపై ఇ-మ్యాగజైన్ ‘ఇండియన్ ఎడ్జ్’ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఇటీవలి పరిణామాలు, ధరల పోకడల విశ్లేషణ, లభ్యత మరియు వినియోగం, రైతుల విజయగాథలు మొదలైన వాటితో సహా దేశీయ మరియు అంతర్జాతీయ ఎరువుల అంశాలపై ఈ మ్యాగజైన్ సమాచారాన్ని అందించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY