కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా శిరోమణీ అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్రమంత్రి పదవికి గురువారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఆమె రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లుగా రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా ప్రధాని మోదీ సూచన మేరకు ఇప్పటివరకు ఆమె నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ బాధ్యతలను కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు అప్పగించారు. నరేంద్రసింగ్ తోమర్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ బాధ్యతల నిర్వర్తిస్తుండగా, అదనంగా ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు.
కేంద్రప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఆర్డినెన్సులు, చట్టాలు తీసుకొచ్చిందని, అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేసినట్టు హర్ సిమ్రత్ కౌర్ పేర్కొన్నారు. ఒక కుమార్తెగా, సోదరిగా రైతుల కోసం నిలబడటం గర్వంగా ఉందని ఆమె ట్విట్టర్ లో తెలిపారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను శిరోమణీ అకాలీదళ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ బిల్లులపై లోక్సభలో చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హర్ సిమ్రత్ కౌర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పటికీ శిరోమణీ అకాలీదళ్ ఎన్డీఏలోనే కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu