పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వ తేదీన 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం దక్కించుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. అయితే ఎట్టకేలకు పంజాబ్ లో సీఎం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఆదివారం నాడు ప్రకటించారు. దీంతో సీఎం అభ్యర్థిత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్సింగ్ సిద్ధూ, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ సునీల్ జాఖర్ లకు నిరాశ ఎదురయింది.
పంజాబ్ లో సీఎం అభ్యర్థి విషయంలో మీ ఓటు ఎవరికో తెలియజేయాలని కోరుతూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ టెలిపోల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆదివారం సీఎం అభ్యర్థిగా చరణ్జిత్ సింగ్ చన్నీ పేరు ప్రకటించిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ఇది నా నిర్ణయం కాదు. పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, పంజాబ్ యువతను అడగగా, ప్రజలు చెప్పినవే నా తుది నిర్ణయానికి దారితీశాయి. ఇది చాలా కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన చన్నీనే సీఎం కావాలని పంజాబ్ ప్రజలు భావించారు. ఇది పంజాబ్ నిర్ణయం” అని అన్నారు. అనంతరం చరణ్జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ “నాపై విశ్వాసం ఉంచినందుకు కాంగ్రెస్ హైకమాండ్ మరియు పంజాబ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. పంజాబ్ను ముందుకు తీసుకెళ్లడానికి గత 111 రోజులుగా మేము చాలా కష్టపడి పని చేయడం మీరు చూసినందున, కొత్త ఉత్సాహంతో మరియు అంకితభావంతో పంజాబ్ మరియు పంజాబీలను ప్రగతి పథంలో తీసుకెళ్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ