కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గురువారం నాడు 10 జనపథ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ముందుగా ఇటీవల ఉత్తర్ ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా సమర్పించాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలు ఇచ్చింది.
కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి వర్గమైన “జీ-23” నాయకుల గ్రూపు తాజాగా విశ్లేషణ ప్రారంభించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జీ-23లో సభ్యుడైన గులాం నబీ ఆజాద్ ఇంటిలో బుధవారం నాడు జీ-23 గ్రూప్ నాయకుల సమావేశం జరిగింది. కపిల్ సిబల్, మణిశంకర్ అయ్యర్, పీజే కురియన్, మనీష్ తివారీ, శశి థరూర్, ఆనంద్ శర్మ, రాజ్ బబ్బర్ మరియు భూపీందర్ సింగ్ హుడా సహా సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం జీ-23 గ్రూప్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, “కాంగ్రెస్ పార్టీ సభ్యులమైన మేము ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన నిరుత్సాహపరిచే ఫలితాల గురించి చర్చించడానికి సమావేశమయ్యాము. సమిష్టిగా అందరినీ కలుపుకొని పోయే నాయకత్వాన్ని అనుసరించి, అన్ని స్థాయిల్లో నిర్ణయాలు తీసుకోవడమే పార్టీ ముందున్న ఏకైక మార్గమని మేము భావిస్తున్నాం. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిందే. 2024కి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం కోసం మార్గం సుగమం చేయడానికి ఇతర సారూప్య శక్తులతో చర్చలు ప్రారంభించాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. ఈ క్రమంలో తదుపరి చర్యలు త్వరలో ప్రకటిస్తాం” అని పేర్కొన్నారు. కాగా జీ-23 గ్రూప్ ప్రతిపాదనలను, తదుపరి నిర్ణయాలను గులాం నబీ ఆజాద్ సోనియా గాంధీ ముందు ఉంచనున్న నేపథ్యంలోనే ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ