కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తును కేటాయిస్తూ నిర్ణయం వెల్లడించింది. ఈసీ తీర్పు తర్వాత, ఠాక్రే విలేకరుల సమావేశం నిర్వహించి తమ అసంతృప్తిని ప్రకటించారు. ఈసీ నిర్ణయాన్ని ‘భారతదేశంలో ప్రజాస్వామ్య హత్య’గా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఇక బిజెపిని ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పేరు మహారాష్ట్రలో పనిచేయదు, కాబట్టి వారు తమ స్వలాభం కోసం వారి ముఖానికి బాలాసాహెబ్ ముసుగు వేయవలసి ఉంటుందని ఆ పార్టీకి తెలుసని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఠాక్రే శనివారం మధ్యాహ్నం మాతోశ్రీలో తన పార్టీ ఎంపీలు మరియు ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఈసీ నిర్ణయంపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలు మరియు అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నారు.
కాగా గతేడాది జూన్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత శివసేనలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దీంతో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనానికి దారితీసింది. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా తొలగించింది. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, అలాగే డిప్యూటీగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పరిణామాల మధ్యే శివసేన యొక్క రెండు వర్గాలు పార్టీ పేరు మరియు ‘విల్లు – బాణం’ గుర్తుపై దావా వేసాయి. విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా వీటిని షిండే వర్గానికి కేటాయిస్తూ నిన్న దీనిపై తుది నిర్ణయాన్ని ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE