దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కాలం నాటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి. ఇప్పటికే పొరుగుదేశం చైనాలో కరోనా మహమ్మారి విరుచుకు పడుతోంది. అక్కడ ఆస్పత్రుల్లో వైద్యానికి పడకలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు.
శనివారం మంత్రి మన్సుఖ్ మాండవియా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో కరోనా ప్రబలకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని, దీనిలో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రధానంగా చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ మరియు థాయ్లాండ్ వంటి దేశాల నుండి భారతదేశానికి వచ్చే ప్రయాణికులు విమాన ప్రయాణీకులు తమ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టును ముందుగానే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఇండియాలో దిగిన తర్వాత కూడా వారికి మరోసారి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఈ ప్రక్రియ మొత్తాన్ని ‘ఎయిర్ సువిధ’ పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తామని మాండవియా వెల్లడించారు.
కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు..
- ప్రతి రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలి.
- ప్రతివారం ఆక్సిజన్ లభ్యతపై ప్రభుత్వాలు సమీక్షించాలి.
- అలాగే అన్ని ఆస్పత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలి.
- అవసరాలకు తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లతో పాటు బ్యాకప్ స్టాక్ కూడా ఏర్పాటు చేసుకోవాలి.
- ఇక లైఫ్ సపోర్ట్ పరికరాలైన వెంటిలేటర్లు, బైపాప్ యంత్రాలు వంటివి తగినన్ని ఏర్పాటు చేసుకోవాలి.
- అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలి.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అజ్ఞాని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ