అంధుల టీ20 ప్రపంచ కప్-2022 విజేతగా భారత జట్టు నిలిచిన విషయం తెలిసిందే. గత శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా భారత అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ గెలవటం ఇది వరుసగా మూడోసారి. ఈ నేపథ్యంలో సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న భారత అంధుల క్రికెట్ జట్టును కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (సీఏబీఏ) ప్రెసిడెంట్ మహంతేష్ జీకే, అలాగే క్రీడల శాఖ, సీఏబీఏ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, మన అథ్లెట్లందరికీ, ముఖ్యంగా మన దివ్యాంగుల అథ్లెట్లకు అత్యుత్తమ సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు. జట్టులోని సభ్యులకు మరింత సహకారం అందిస్తానని, వారి మార్గంలో వస్తున్న వివిధ సవాళ్లను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంధుల క్రికెట్ జట్టు కుటుంబ సభ్యుల మద్దతును ప్రస్తావిస్తూ, ఆటగాళ్ళతో అనుబంధించబడిన కుటుంబ సభ్యులందరూ అపారమైన మద్దతునిచ్చారని, కుటుంబాల మద్దతు లేకుంటే చాలా మంది ఆటగాళ్లు భారత జట్టులోకి రాకపోయి ఉండవచ్చుని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుండి అందుతున్న నిరంతర మద్దతు మరింత ఎక్కువగా ప్రదర్శన చేయడానికి ప్రోత్సహిస్తుందన్నారు. గెలుపు వెనుక అపారమైన కృషి, ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, అయితే మైదానంలోకి వెళ్లిన తర్వాత, మన భారతీయ జెండా గురించి తప్ప మరేమీ ఆలోచించమని స్పష్టం చేశాడు. అడ్డంకులను అధిగమిస్తామని, భారత జట్టు ఇప్పటికే 5 ప్రపంచ కప్లను గెలుచుకుందని మరియు మరిన్ని గెలుస్తామన్న విశ్వాసంతో ఉన్నామని అజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు టీ20 ప్రపంచ కప్-2022 గెలుచుకున్న భారత జాతీయ అంధుల క్రికెట్ జట్టులో మొత్తం 10 రాష్ట్రాల నుండి 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. వారిలో ఆరుగురు ఆటగాళ్ళు B1 (పూర్తి అంధత్వం), ఐదుగురు ఆటగాళ్ళు B2 (పాక్షికంగా అంధులు) మరియు ఆరుగురు ఆటగాళ్లు B3 వర్గం (6 మీటర్ల వరకు కంటి చూపు) నుండి ఉన్నారు. భారతజట్టు 2012, 2017లో పాకిస్థాన్ ను ఓడించి టీ20 ప్రపంచకప్ టైటిల్స్ కైవసం చేసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE