స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సామరస్యపూర్వకమైన, సమ్మిళిత సమాజం కోసం పాటుపడాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు దేశంలోని యువతకు పిలుపునిచ్చారు. అన్ని రకాల వివక్షలు లేని సమాజాన్ని నిర్మించడమే మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి అని చెప్పారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీషా జీవిత చరిత్రను, స్వాతంత్య్ర పూర్వం వారు పార్లమెంట్లో చేసిన ప్రసంగాల సంకలనాలను సంబంధించిన పుస్తకాన్ని వెంకయ్య నాయుడు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ, అంతర్జాతీయ భాషల అధ్యయనంతోపాటు పురాణేతిహాసాలను ఔపోసన పట్టిన ఆధ్యాత్మిక వేత్త ఉమర్ అలీషా అని అన్నారు. “ఉమర్ అలీషా గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు. ఆంగ్లేయుల కాలంలో కేంద్ర చట్టసభ సభ్యులుగా కూడా సేవలందించారు. జాతీయతాభావం, సమానత్వం, సౌభ్రాతృత్వం, సర్వమానవ సమభావన, మహిళాభ్యుదయ కాంక్షను ఆచరణలో చూపిన వారి గురించి యువత తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత, సేవ రెండూ వేర్వేరు కాదు. ఆధ్యాత్మికత అనేది పూజా విధానం కాదు. మన మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానం. మన విద్యుక్త ధర్మాన్ని త్రికరణశుద్ధిగా నిర్వహించడం. ఉమర్ అలీషా ఆధ్యాత్మిక మార్గానికి, ఆచరణలో గొప్ప అర్ధాన్ని చూపించారు” అని చెప్పారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనదని, ఈ దిశగా సమాజపు ఆలోచనా తీరు మారాలన్నారు. మన సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి, అయితే వాటిలోని పరమార్థాన్ని అర్ధం చేసుకుని, కాలానుగుణంగా వచ్చే మార్పులను స్వాగతించాలని, అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమౌతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం మాజీ పీఠాధిపతి ఉమర్ అలీషా, పలువురు రచయితలు, భాషావేత్తలు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ