డాలర్ల కోసం వివిధ దేశాల నుంచి అమెరికాకు వలస వెళుతుంటారు. అమెరికా ఏ దేశంతో వ్యాపారం చేసినా డాలర్లలోనే చెల్లింపులు చేస్తుంది. డాలర్ను ప్రపంచ కరెన్సీగా అన్ని దేశాలు అంగీకరించడం వల్లే ఇది సాధ్యమవుతోంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా క్రమంగా క్షీణిస్తోంది. ఒకప్పుడు అమెరికా చాలా దేశాలపై పెత్తనం చెలాయించింది. కానీ.. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. అమెరికా చెప్పినట్టు తలాడించే దేశాలు ఇప్పుడు దాదాపుగా లేవు.
అమెరికా డాలర్పై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. దాదాపుగా డాలర్కు ఇక నూకలు చెల్లినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డాలర్కు దీటుగా చైనా కరెన్సీ యువాన్, భారత కరెన్సీ రూపాయి, రష్యా కరెన్సీ రూబుల్ దూసుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో వివిధ దేశాల్లో తన వస్తువులను కుప్పలు తెప్పలుగా పోస్తున్న చైనా.. ఆ దేశాలతో వాణిజ్యాన్ని డాలర్లలో కాకుండా యువాన్లలోనే చేస్తోంది. అంటే ఆ వస్తువులు కొన్న దేశాలు చైనా కరెన్సీ అయిన యువాన్లలో నగదు చెల్లించాలి.
ఇక భారత్ కూడా ఎక్కువ దేశాలతో కాకపోయినా రష్యా, ఇరాన్, ఒమన్ తదితర దేశాలతో రూపాయల్లో చెల్లింపులు జరుపుతోంది. ఆయా దేశాల నుంచి భారత్ కొంటున్న చమురుకు డాలర్లలో కాకుండా రూపాయిల్లోనే చెల్లింపులు చేస్తోంది. మరికొన్ని దేశాలతో సైతం ఇదే రకమైన ఒప్పందాలను కుదుర్చుకునే పనిలో ఉంది. దీనివల్ల భారత్కు భారీ ఎత్తున కరెన్సీ ఆదా అవుతోంది. ప్రస్తుతం ఒక్క అమెరికన్ డాలర్ దాదాపు రూ.85 సమానంగా ఉంది. డాలర్లలో చెల్లించడం వల్ల అందుకు సమానమైన భారత కరెన్సీని చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు భారత కరెన్సీలోనే చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఇటు మనదేశానికి, అటు మనతో వాణిజ్యం చేసే దేశాలకు ప్రయోజనం కలుగుతోంది. తాజాగా యూఏఈ నుంచి 10 లక్షల పీపాల చమురుకు రూపాయల్లో చెల్లింపులు జరిపేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇక రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో చాలా దేశాలు రష్యాపైన ఆంక్షలు విధించాయి. అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు, యూరోపియన్ యూనియన్లోని పలు దేశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు రష్యా కూడా ఆ దేశాలకు చమురు ఎగుమతులను నిలిపివేసింది. అతి తక్కువ ధరకే చైనాకు, భారత్కు చమురు ఎగుమతి చేయడంతో..రూబుళ్లలో నగదు స్వీకరిస్తోంది. అమెరికా డాలర్తో పోల్చితే రూబుల్ తక్కువే ఉండటం వల్ల భారత్, చైనా భారీగా నగదును పొదుపు చేసుకోగలిగాయి. చాలా తక్కువ రేట్లకే రష్యా నుంచి ఈ రెండు దేశాలు చమురు కొనుగోలు చేశాయి. ఈ విషయంలో అమెరికా ఒత్తిడికి కూడా భారత్ తలొగ్గలేదు. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని అగ్రరాజ్యానికి కుండలు బద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE