మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు చెందిన రాజకీయ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అలాగే ఈ నిర్ణయంపై ఐ-ప్యాక్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ‘పంజాబ్ ఫలితాల తర్వాత, మేం ఎదుర్కొన్న ప్రత్యర్థుల్లో అత్యంత కఠినమైన ప్రత్యర్థిగా మిమ్మల్ని గుర్తించాం. అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలతో చేతులు కలపడం ఆనందంగా ఉందని’ పేర్కొంది.
ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐ-ప్యాక్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తోంది. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతాబెనర్జీని మరోసారి గెలిపించేందుకు వ్యూహా రచనలు చేస్తోంది. ఐ-ప్యాక్ రాజకీయ కన్సల్టెన్సీ మొదటగా 2014 ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత బీహార్ లో జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్, పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంలో కూడా ప్రశాంత్ కిశోర్ ప్రముఖ పాత్ర పోషించారు. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భావిస్తున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రశాంత్ కిశోర్ తో చేతులు కలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
[subscribe]