కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ను అక్టోబర్ 16, బుధవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేసారు. గతంలోనే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి చిదంబరం ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. చిదంబరాన్ని ఆగస్టు 21న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. సీబీఐ విచారణ అనంతరం, జ్యూడిషయల్ కస్టడీ లో భాగంగా ఆయన 55 రోజులుగా తీహార్ జైల్లో ఉంటున్నారు.
అయితే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నగదు అక్రమ చలామణికి సంబంధించి అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అక్టోబర్ 15 మంగళవారం నాడు కోర్టు వారికీ అనుమతి నిచ్చింది. విచారణ చేసేందుకు జైల్లోనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఉదయం ఈడీ అధికారులు జైలుకు చేరుకొని, దాదాపు గంటపాటు చిదంబరాన్ని ప్రశ్నించారు, అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసారు.
[subscribe]