ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), చంద్రయాన్-2 ను జూలై 15 న ప్రయోగించబోతున్నట్టు ఇస్రో చైర్మన్ కె.శివన్ చెప్పారు. ఇప్పటికే కొంత జాప్యత జరిగిన,పూర్తి స్థాయిలో ప్రయోగానికి సిద్ధమయ్యామని, జులై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిముషాలకు జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ సాయంతో ఈ మిషన్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇస్రో,తక్కువ ఖర్చుతో కూడిన మిషన్ చంద్రయాన్ 2 ను ప్రారంభించి,చంద్రునిపైకి పంపనుంది. రష్యా, చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ (యు.ఎస్) తరువాత చంద్రునిపైకి దిగడానికి అంతరిక్ష యాత్రను ప్రారంభించిన 4వ దేశంగా ఇండియా చరిత్ర కెక్కనుంది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ సాయంతో నింగిలోకి చేరుకుంటుంది. ఈ ప్రయోగం గురించి ఇస్రో శాస్త్రవేత్తలంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇది చంద్రయాన్ పేరుతో ఇస్రో చేస్తున్న రెండవ ప్రయోగం, గతంలో అక్టోబర్ 2008 లో భారతదేశం తన లైట్ రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్వి.) ను ఉపయోగించి చంద్రయాన్ 1 ను ప్రారంభించింది. ఇస్రో చీఫ్ కె. శివన్ మాట్లాడుతూ మీటరు పొడవైన 25 కేజీల బరువుగల రోవర్, మరియు లాండర్లు చంద్రుని పైకి పంపనున్నామని చెప్పారు. వివరణాత్మక స్థలాకృతి అధ్యయనాలు నిర్వహించడం ద్వారా చంద్రుని యొక్క మూలం మరియు ఇతర వివరాలు గురించి ఇస్రో బృందం బాగా అర్థం చేసుకోవడానికి ఈ మిషన్ సహాయపడుతుందని భావిస్తున్నారు.