భారత మహిళల క్రికెట్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం నమోదైంది. ఇప్పటివరకు వన్డేల్లో కానీ, టీ-20ల్లో కానీ ఒక్కసారి కూడా ప్రపంచ కప్ను గెలుచుకోలేకపోయిన అమ్మాయిలు ఆ లోటును భర్తీ చేస్తూ తొలిసారిగా మహిళల అండర్-19 వరల్డ్ కప్ సాధించారు. దక్షిణాఫ్రికా వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి ట్రోఫీని సొంతం విజేతగా గెలుచుకున్నారు. కాగా భారత జావెలిన్ ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా మ్యాచ్ వీక్షించడానికి వచ్చి అమ్మాయిలను ఉత్సాహ పరిచాడు. టిటాస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కగా.. ఇంగ్లండ్ కెప్టెన్ గ్రేస్ సీవెన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచింది. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 17.1 ఓవర్లలో కేవలం 68 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు బ్యాట్స్ ఉమెన్స్లో ర్యానా మెక్డొనాల్డ్ 19 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. స్మాలే, స్టోన్హౌజ్ చెరో 11 పరుగులు చేశారు.
ఇక భారత బౌలర్లలో టిటాస్ సాధు అద్భుత ప్రదర్శన చేసింది. 4 ఓవర్లలో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసింది. పర్శవీ చోప్రా (2/13), అర్చన దేవి (2/17)లు చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం భారత్ స్వల్ప టార్గెట్ను సులువుగా ఛేదించింది. మరో ఆరు ఓవర్లు మిగిలుండగానే 14 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. కెప్టెన్ షెఫాలీ వర్మ (15 పరుగులు), శ్వేత షెరవాత్ (5 పరుగులు) త్వరగానే అవుట్ అయినా.. గొంగడి త్రిష (29 బంతుల్లో 3 ఫోర్లతో 24), సౌమ్య తివారి (37 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్) ఇండియాకు అద్భుత విజయాన్ని అందించారు. కాగా త్రిష మన తెలుగు అమ్మాయి కావడం విశేషం. తెలంగాణలోని భద్రాచలంకు చెందిన త్రిష గత కొన్ని నెలల క్రితమే మహిళల అండర్-19 వరల్డ్ కప్ ప్రాబబుల్స్లో చోటు దక్కించుకోవడం తెలిసిందే. ఇదే టోర్నీలో స్కాట్లాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన త్రిష అర్ధ శతకంతో రాణించింది
ఇక ఈ విజయంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) హర్షం వ్యక్తం చేసింది. అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకున్న మహిళల జట్టుకు భారీ మొత్తాన్ని నజరానాగా ప్రకటించింది. జట్టుతో పాటు సహాయక సిబ్బందికి అందరికీ కలిపి రూ.5 కోట్ల నజరానా అందించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ఇక ఈ అద్భుత విజయం సాధించిన అమ్మాయిలు భారత్ క్రికెట్ కు ఎంతో మేలు చేశారు. మహిళల క్రికెట్ స్థాయిని అమాంతం పెంచేశారు. తద్వారా ఎంతోమంది యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచారు. అందుకే వారిని అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20కి అతిథులుగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
స్కోరు బోర్డు
ఇంగ్లండ్: స్ర్కీవెన్స్ (సి) త్రిష (బి) అర్చన 4, హీప్ (సి అండ్ బి) టిటాస్ 0, హాలెండ్ (బి) అర్చన 10, స్మేల్ (బి) టిటాస్ 3, మెక్డొనాల్డ్-గే (సి) అర్చన (బి) పర్శవి 19, పవ్లీ (ఎల్బీ) పర్శవి 2, అలెక్సా (సి) సోనమ్ (బి) మన్నత్ 11, గ్రోవ్స్ (రనౌట్/తివారి) 4, బాకర్ (స్టంప్డ్) రిచా (బి) షఫాలీ 0, సోఫియా (సి అండ్ బి) సోనమ్ 11, ఎల్లీ అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు: 4; మొత్తం: 17.1 ఓవర్లలో 68 ఆలౌట్.
బౌలింగ్: టిటాస్ సాధు 4-0-6-2, అర్చనా దేవి 3-0-17-2, పర్శవి చోప్రా 4-0-13-2, మన్నత్ కశ్యప్ 3-0-13-1, షఫాలీ 2-0-16-1, సోనమ్ యాదవ్ 1.1-0-3-1.
భారత్: షఫాలీ (సి) అలెక్సా (బి) బాకర్ 15, శ్వేత (సి) బాకర్ (బి) స్ర్కీవెన్స్ 5, సౌమ్య (నాటౌట్) 24, త్రిష (బి) అలెక్సా 24, హృషిత బసు (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు: 1; మొత్తం: 14 ఓవర్లలో 69/3.
బౌలింగ్: హనా బాకర్ 4-1-13-1, సోఫియా 2-0-16-0, గ్రేస్ స్ర్కీవెన్స్ 3-0-13-1, జోసీ గ్రోవ్స్ 2-0-9-0, అలెక్సా 2-0-8-1, ఎల్లీ అండర్సన్ 1-0-10-0.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE