ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు పెరిగిన నేపథ్యంలో ఎరువుల కోటాను పెంచడం, కేటాయించిన యూరియా కోటా వెంటనే పంపించడం వంటి అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. ఎరువుల కోటా, యూరియా పంపే అంశాలపై మంత్రి సదానంద గౌడ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సానుకూల విధానాలు, కలిసివచ్చిన వాతావరణ పరిస్థితులతో రాష్ట్రంలో గణనీయంగా సాగువిస్తీర్ణం పెరిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
“రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలు సాగయింది. మరో 8.5 లక్షల ఎకరాలలో ఉద్యానపంటలున్నాయి. మరో ఆరేడు లక్షల ఎకరాలలో వరినాట్లు వేయాల్సి ఉంది. మొత్తంగా తెలంగాణలో ఈ వానాకాలంలో దాదాపు ఒక కోటి 41 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతాయని అంచనా. సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఎరువుల వాడకం కూడా గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఈ రోజు వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడితే, ఈ ఏడాది ఈ రోజు వరకు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడడం జరిగింది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో వర్షపాతం నమోదు అయింది. సాగునీటి రాకతో గతంతో పోల్చితే ఆరేళ్లుగా సాగు విస్తరణ పెరుగుతుంది. పెరిగిన సాగును పరిగణనలోకి తీసుకుని ఎరువుల కోటా పెంచి సరఫరా చేయండి. తెలంగాణకు ఈ వానాకాలానికి పదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించడం జరిగింది. ఈ నెల కోటాగా రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రాష్టానికి 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. మిగిలిన మొత్తం వెంటనే పంపించండి. ఆగస్టు నెలల్లో ఎరువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగం దేశాన్ని బతికిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ వ్యవసాయాన్ని బతికిస్తున్న రైతన్నలకు వెన్నుదన్నుగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ ఏ గ్రామాల్లో ఎంత పంట వేశారు అనేది ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా లెక్కలు నమోదు చేసింది” అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu