మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతుండటంతో.. తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హస్తం పార్టీ.. అదే జోష్ను లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. దీనికోసం బరిలో బలమైన అభ్యర్థులను నిలపడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్లోని అభ్యర్థులతో తెరవెనుక మంతనాలు జరుపుతోంది. అంతేకాదు లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్చార్జ్లుగా నియమించింది.
ఇక శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికల్లో ఎలా అయినా తమ సత్తా చాటాలనుకుంటోంది. దీంతో ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. అభ్యర్థుల ఎంపికకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ సారి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బలం పుంజుకుంది. గతంలో ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉండగా, తాజాగా 8 మంది గెలిచారు. రెండో స్థానంలో 19 మంది నిలిచారు. చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్ల శాతం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మరింత పుంజుకోవాలని కమలం పార్టీ కుస్తీ పడుతోంది.
తెలంగాణలో కీలకమైన లోక్సభ నియోజకవర్గం ఏదంటే హైదరాబాద్ అనే అంటారు. అయితే ఇది ఎంఐఎంకు కంచుకోటగా చెబుతారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి 5 దశాబ్దాలుగా ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ, ఈసారి ఈ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని గట్టిగా అనుకుంటున్న బీజేపీ ..దీనికోసం హైదరాబాద్ ఎంపీగా ఈసారి రాజాసింగ్ను బరిలోకి దించడానికి పావులు కదుపుతోంది.
గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ను పార్లమెంట్ ఎన్నికలలో నిలబెడితే .. తెలంగాణలో క్షేత్రస్థాయికి హిందుత్వ వాదాన్ని బలంగా తీసుకెళ్లవచ్చనేది బీజేపీ ఆలోచన. అంతేకాదు ఇటు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ ఎంఐఎంతో దోస్తీకి ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్కు చెక్ పెట్టడంతో పాటు అటు ఎంఐఎంకు కూడా ఒకేసారి రాజాసింగ్తో చెక్ పెట్టొచ్చని కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
హైదరాబాద్ అంటేనే పాతబస్తీగా భాగ్యనగర ఓటర్లు చెబుతారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో పాత బస్తీలోని మూడు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఒక స్థానంలో విజయం సాధించింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏడు నియోజకవర్గాల్లో నాలుగింటిలో కమలం పార్టీ బలం పెరిగినట్లే అయింది. ఇది కూడా తమకు ఈ ఎన్నికలలో ప్లస్గా మారుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అగ్రెసివ్ హిందుత్వ వాదిగా ముద్రపడ్డ రాజాసింగ్ను హైదరాబాద్ బరిలో నిలపడం వల్ల ఎంఐఎం కంచుకోటను బద్ధలు కొట్టాలనేదే ఢిల్లీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. పాతబస్తీ కేంద్రంగా పాలిటిక్స్ చేస్తున్న ఎంఐఎం.. ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్, పశ్చిమ బెంగాల్, గోవా, హర్యానా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మెరుగైన ఓట్లు సీట్లు సాధించడంతో.. ఎంఐఎంకు ఎలాగయినా చెక్ పెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర పెద్దలు అడుగులు వేస్తున్నారు.
తెలంగాణలో ఎంఐఎంపై పోటీ ఇవ్వడానికి బలమైన అభ్యర్థిని నిలపడానికి ఇప్పటి వరకూ ఏ పార్టీలు ప్రయత్నించలేదు. ముఖ్యంగా అధికార పార్టీ ఏది అయినా సరే ఎంఐఎంను ఫ్రెండ్లీ పార్టీగానే చూశాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. అందుకే ఎంఐఎంకు పాత బస్తీపై పట్టు ఇప్పటి వరకూ సడలడం లేదు. అంతేకాదు హైదరాబాద్ లోక్సభ సీటు కూడా ఇక ఎంఐఎందే అన్న భావన అందరిలో ఏర్పడింది. కానీ దీనికి చెక్ పెట్టడానికి కమల నాధులు స్కెచ్ వేస్తున్నారు.
చరిత్రకు భిన్నంగా.. రాజీసింగ్ను ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్పై పోటీకి పంపి ఎంఐఎంకు గట్టి షాక్ ఇవ్వడానికి పావులు కదుపుతోంది. అంతేకాదు బీజేపీకి అతి బలంగా ఉండే హిందుత్వ వాదాన్ని ఇప్పుడు.. బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణాదిన కూడా మెల్లమెల్లగా హిందుత్వ వాదం బలపడుతోంది. అందుకే హిందుత్వ ఎజెండాతోనే దేశంలో మూడోసారి తాము అధికారంలోకి రావాలని ఢిల్లీ అధిష్టానం భావిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE