‘‘మాలాంటి వాళ్లు అసూయపడేలా మంత్రి హరీశ్రావు సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నారు. నేను సిరిసిల్ల పోతుంటే సిద్దిపేటకు రాగానే ఏం సంగతి బావ.. మళ్లీ ఏదో కొత్తది కడుతున్నావ్ అని అడుగుతాను. అరేయ్ నువ్వు ఏమీ చూడకుండా కళ్లు మూసుకొని పోరా.. అని అంటుంటాడు. అయినా బావ కాబట్టి ఏడిపిస్తుంటా’’ అని సిద్దిపేటలో నిర్మించిన ఐటీటవర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ప్రతీ నియోజకవర్గం సిద్దిపేటలా మారితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని కూడా అన్నారు. ఆయనే కాదు.. హరీశ్రావు, కేసీఆర్ కూడా సిద్దిపేట అభివృద్ధి కోసం చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే సిటీ తరహా అభివృద్ధి కనిపిస్తుంది కూడా. అవన్నీ పైపై మెరుగులే అని.. ఆ అభివృద్ధి మాటున ఎన్నో చేదు నిజాలు.. భారీ స్థాయిలో అప్పులు – చెల్లించాల్సిన బకాయిఉలు ఉన్నాయని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. సిద్ధిపేటనే అభివృద్ధి చెందిన కొన్ని ప్రాంతాల్లోని పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది.
పైపై మెరుపులతో ధగధగలాడే సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోయినట్లు ప్రభుత్వం బహిర్గతం చేసింది. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించిన ఈ వివరాలు చర్చనీయాంశంగా మారాయి. సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలు అభివృద్ధికి రోల్ మోడల్ అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోగా.. కనీసం విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించలేదంటూ కాంగ్రెస్ సర్కారు విమర్శించడం అసెంబ్లీలో రచ్చకు దారి తీసింది. రచ్చ.. చర్చ ఎలాగున్నా.. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రూ.1,983 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు ఆ శాఖ అధికారులే ధ్రువీకరిస్తున్నారు. ఇందులో ఇందులో నీటి పారుదల శాఖ, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన బిల్లులే 97 శాతానికి పైగా ఉన్నాయి.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో రంగనాయకసాగర్, శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నిర్మించిన విషయం తెలిసిందే. 2020 నుంచి ఆయా రిజర్వాయర్లలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లులే రూ.1,018 కోట్ల వరకు పెండింగ్లో ఉండడంతో బకాయిల శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గత మార్చిలోనే బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. అలా చేయకపోవడంతో బిల్లుల భారం తడిసి మోపెడైంది. మరోవైపు.. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కలెక్టరేట్, సీపీ కార్యాలయం, పోలీస్ స్టేషన్లు, ఇతర కార్యాలయాలు బాకీ పడిన విద్యుత్ బిల్లులే రూ. 920 కోట్ల దాకా ఉన్నాయి. వీధి దీపాలకు సంబంధించి ఆయా పంచాయతీలు, మునిసిపాలిటీలు రూ. 15 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది.
ఏటా మార్చిలో ఎంతో కొంత బిల్లు చెల్లించి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3లక్షలకు పైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ప్రతి నెలా రూ.14కోట్ల వరకు బిల్లులు వస్తాయి. వీటిలో సుమారుగా రూ.2కోట్ల వరకు బిల్లులు ఆ తర్వాతి నెలల్లో చెల్లిస్తుంటారని, ఆ నెలకు సంబంధించిన బిల్లులు మళ్లీ పెండింగ్లో పడుతుంటాయని అధికారులు చెబుతున్నారు. ఇవి కాకుండా మరో రూ.5కోట్ల వరకు మొండి బకాయిలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఒక్క విద్యుత్ రంగంలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ అదే దుస్థితి ఉందని ప్రభుత్వం గణాంకాల్లో సైతం బహిర్గతం చేస్తోంది. ఆ గణాంకాలు పరిశీలిస్తున్న ప్రజలు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న అభివృద్ది మాటున అప్పుల కుప్పలు, బకాయిలు దాగున్నాయా.. అని ఆశ్చర్యపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE