హైదరాబాద్ నగరంలో సగానికి పైగా జనాభా కరోనా వైరస్ కి వ్యతిరేకంగా యాంటీబాడీలు కలిగిఉన్నట్టు సర్వేలో తేలింది. నగరంలో సుమారు 9,000 నమూనాలను అధ్యయనం చేయగా 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ప్రకటించింది. ఐసిఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) మరియు భారత్ బయోటెక్ సంస్థతో కలిసి నగరంలోని 30 వార్డులలోని ప్రజలపై సీరో సర్వే చేసినట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. ఒక్కో వార్డులో 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన 300 మందిపై సీరో సర్వే చేయగా, చాలా వార్డులలో 50-60 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నట్టు తేలిందన్నారు. మొత్తం సర్వేకి సంబంధించి 56శాతం మహిళలు, 53శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నాయని చెప్పారు. అలాగే యాంటీబాడీలు కలిగిఉన్న జనాభాలో 75 శాతానికి పైగా వారికీ కరోనా వైరస్ సోకినట్టు కూడా తెలియదని తేలిందన్నారు.
ఈ అధ్యయనం ద్వారా నగర జనాభాలో కరోనావైరస్ కు వ్యతిరేకంగా పెరిగిన రక్షణాత్మక రోగనిరోధక ప్రతిస్పందన వెల్లడయిందని రాకేశ్ మిశ్రా అన్నారు. ఈ నివేదిక ద్వారా హైదరాబాద్ జనాభా నెమ్మదిగా హెర్డ్ ఇమ్మ్యూనిటీ వైపుగా చేరుతుందని చెప్పొచ్చని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ద్వారా ఇది మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 4, గురువారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,99,572 కి చేరింది. ఇందులో 2,95,970 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం 1,963 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ