తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన/ ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇటీవల కేంద్ర హోంశాఖ లేఖలు సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 12వ తేదీన “మినిస్టర్ ఆఫ్ హోం అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా” సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీల సమావేశంలో అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం “రాష్ట్ర పునర్విభజన” చట్టానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉందన్న విషయాన్ని సమావేశంలో స్పష్టం చేయాలని సీఎస్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుంటేనే సహకరించాలని, లేదంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండరాదని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవసరం లేని వివాదాలు సృష్టిస్తూ విభజన చట్టంలో లేని అంశాలను కావాలని ముందుకు తెస్తున్నది. విభజన చట్టానికి వ్యతిరేకంగా సింగరేణి లాంటి సంస్థలలో వాటా కావాలని గొంతమ్మ కోరికలు కోరడం మూలంగానే ఇప్పటికే పరిష్కారం కావల్సిన అనేక అంశాలు, ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని” సీఎంకు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో విభజన చట్టంలోని షెడ్యూళ్లు 9 మరియు 10 లోని అంశాలపై గతంలో అనుసరించిన విధంగానే ముందుకు పోవాలని సీఎం ఆదేశించారు. కాగా జనవరి 12 నాటికి కరోనా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమావేశంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ