తెలంగాణ శాసనసభలో సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు, అభివృద్ధిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. తెలంగాణ ఉజ్వలమైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో పాటుగా గొప్ప కళలతో కూడుకున్న ప్రాంతమని చెప్పారు. 58 సంవత్సరాలు పాటుగా సమైక్యాంధ్ర ప్రదేశ్లో తెలంగాణను ఏ విషయంలో కూడా పట్టించుకోలేదని, ప్రమోట్ చేయలేదని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన, విశేషమైన జలపాతాలు ఉన్నాయని, ఖమ్మంలో పాండవుల గుట్టను పట్టించుకోలేదని అన్నారు. అవే కాకుండా వారసత్వంలో వచ్చిన పురాతన కోటలు ఉన్నాయని, రాజంపేట కోట, దోమకొండ కోట కూడా అప్పగిస్తామని చెప్పారన్నారు. ఇన్ని ఉన్నప్పటికి తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని అన్నారు. ఇటీవల భేటీ సందర్భంగా ప్రధాని మోదీతో ఈ అంశాన్ని ప్రస్తావించానని చెప్పారు.
తెలంగాణలో ఉన్న ప్రకృతి సౌందర్యాలను కాపాడుకుంటాం:
తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డుల కోసం జాబితాను పంపాలా? వద్దా?, తెలంగాణలో కళాకారులు, విశిష్టమైన వ్యక్తులు లేరా? ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధాని మోదీని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను అడిగినట్టు చెప్పారు. ఈ విషయాన్ని తప్పకుండా పరిశీలన చేస్తామని వారు చెప్పినట్టు తెలిపారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్లోని జోగులాంబ ఆలయాన్ని కూడా సమైక్య రాష్ట్రంలో ప్రచారం చేయలేదన్నారు. తెలంగాణలో ఉన్న ప్రకృతి సౌందర్యాలను కాపాడుకుంటామని సభ్యులకు హామీ ఇస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో 160 కి.మీ మేర గోదావరి ఉందని, అభివృద్ధి చేయడానికి అక్కడ కూడా ఎంతో అవకాశం ఉందన్నారు. మగధ సామ్రాజ్యం ఎంత విశిష్టంగా, వైభవంగా ఉండేదో, మన శాతావాహనుల దగ్గర, కోటి లింగాల దగ్గర అంటే వైభవంగా, గొప్పగా ఉండేదన్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో చారిత్రాకమైన ప్రదేశాలు, కోటలు, దర్శనీయ స్థలాలు, విశిష్టమైన ప్రముఖ దేవాయాలను, వాటి ప్రాచుర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో కోరిన ఎయిర్ స్ట్రిప్స్ విషయంలో కూడా కాలయాపన చేయొద్దని కేంద్రాన్ని కోరినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ