హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు (సెప్టెంబర్ 25, ఆదివారం) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం క్రికెట్ అభిమానులు, ప్రజలు ఇళ్లకు చేరేందుకు వీలుగా స్పెషల్ ట్రైన్లను నడపాలని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నిర్ణయించింది. స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి ఆదివారం రాత్రి 11 గంటల నుండి ప్రత్యేక మెట్రో రైళ్లను నడపనున్నామని, ఇక చివరి రైలు అర్ధరాత్రి 1గంటకు (సెప్టెంబరు 26, 1 AM) ఆ స్టేషన్ నుండి బయలుదేరుతుందని తెలిపారు.
అలాగే ప్రత్యేక మెట్రో రైళ్ల ఏర్పాటుపై సంస్థ కీలక సూచనలు చేసింది. “అమీర్పేట్ మరియు జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి కనెక్టింగ్ రైళ్లు ఉంటాయి. ప్రత్యేక రైళ్ల సర్వీసు సమయంలో ఉప్పల్, స్టేడియం మరియు ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ప్రవేశాలకు అనుమతి ఉంటుంది. అన్ని ఇతర స్టేషన్లు నిష్క్రమణల కోసం మాత్రమే తెరవబడతాయి. మేము కస్టమర్లు/ప్రయాణికులను ముందుగానే రిటర్న్ టికెట్స్ ను కొనుగోలు చేయమని లేదా కనీసం మ్యాచ్కి వెళ్లే ముందు స్టేడియం మెట్రో స్టేషన్ నుండి నిష్క్రమించేటప్పుడు రిటర్న్ టికెట్స్ కొనాలని సూచిస్తున్నాం. అలాగే ప్రయాణ సౌలభ్యం కోసం మరియు క్యూలో నిలబడకుండా ఉండటానికి స్మార్ట్ కార్డ్లను ఉపయోగించమని కస్టమర్లను ప్రోత్సహిస్తున్నాం. సాధారణ పని గంటల తర్వాత డిజిటల్ టిక్కెట్లు విక్రయించబడవు. రాత్రి 10:15 గంటలలోపు కొనుగోలు చేసిన ప్రస్తుత టిక్కెట్లు ఉప్పల్, స్టేడియం మరియు ఎన్జీఆర్ఐ స్టేషన్ నుండి మాత్రమే ఆ రోజు సేవలు ముగిసే వరకు పని చేస్తాయి. ప్రయాణీకులు హైదరాబాద్ మెట్రో రైలు భద్రతా సిబ్బంది మరియు సిబ్బందికి సహకరించాలని అభ్యర్థిస్తున్నాం” అని ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY