తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) ఎ.శాంతి కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు (జనవరి 11, బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా చీఫ్ సెక్రెటరీ (సీఎస్) గా శాంతి కుమారి గుర్తింపు పొందనున్నారు. ఎ.శాంతి కుమారి 1989 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి. తాజా నియామకంతో 2025, ఏప్రిల్ వరకు ఆమె తెలంగాణ సీఎస్ గా కొనసానున్నారు.
ఇప్పటివరకు తెలంగాణ సీఎస్ గా విధులు నిర్వర్తించిన సోమేశ్ కుమార్ ను రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో సోమేశ్ కుమార్ కొనసాగేందుకు క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను మంగళవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆయనను వెంటనే రిలీవ్ చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ కి కేటాయించడంతో జనవరి 12వ తేదీలోగా ఆ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు. సోమేశ్ కుమార్ రిలీవ్ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ నూతన సీఎస్ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టి సారించి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ శాంతి కుమారి పేరును ఖరారు చేశారు. రామకృష్ణారావు, అరవింద్ కుమార్ సహా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సీఎస్ రేసులో ఉన్నప్పటికీ, గతంలో సీఎం కార్యాలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించిన శాంతి కుమారి వైపే సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు. శాంతి కుమారి గతంలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలను, సీఎంవోలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా బాధ్యతలను నిర్వహించారు. మరోవైపు సీఎం కేసీఆర్ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్ గా కూడా శాంతి కుమారి పనిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE