కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాటలను రైతులు నమ్మే స్ధితిలో లేరని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నిన్నటి వరంగల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శనివారం మంత్రి ఎర్రబెల్లి స్పందించారు. హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. మీతో పొత్తు పెట్టుకోవడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరని అన్నారు. అయినా 10 సీట్లు కూడా గెలవలేని పార్టీలతో మాకు పొత్తేంటని ప్రశ్నించారు. ప్రస్తుతం జాతీయ పార్టీల కంటే, ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అనేక పథకాలు అమలవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ ప్రకటనపై మంత్రి స్పందిస్తూ.. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రుణ మాఫీ చేశారా అని, పంటలకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మీరు అధికారంలో వున్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి ఎందుకు అనుసంధానం చేయలేదని, అలాగే రైతు బంధు, రైతు బీమా లాంటివి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం తెస్తే.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్య్రం తెచ్చిందని తెలిపారు. ప్రజలకు మేలు చేసేదెవరు.. మాయ చేసేదెవరు అనే విషయంలో పూర్తి స్పష్టత ఉందని, వారు అంత అమాయకులు కాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ