తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణ ముగింసిందని ప్రకటించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఈ సీజన్లో మొత్తం రూ. 9,916 కోట్ల విలువైన 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించినట్లు వెల్లడించారు. అలాగే రైతులకు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని గంగుల హామీ ఇచ్చారు. కేంద్రం మొండి వైఖరి వల్లే చివరి వరకు వేచి చూడాల్సి వచ్చిందని, లేదంటే ఇంకా ముందుగానే కొనుగోళ్లు పూర్తయ్యేవని అన్నారు. అలాగే కరోనా, అకాల వర్షాలు, గోనె సంచుల కొరత వంటి ఇబ్బందుల్లోనూ పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టామని మంత్రి గంగుల తెలిపారు.
కేంద్రం ఎలాంటి సహకారం అందించకున్నా తెలంగాణ రైతాంగం నష్టపోకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ధృఢ సంకల్పంతో యాసంగి ధాన్యం సేకరణకు ఆదేశించారని మంత్రి గుర్తుచేశారు. 2021-22 రబీ సీజన్లో రూ.9,916 కోట్ల విలువైన 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, దీనికి సంబంధించి రైతులకు రూ.9,680 కోట్లు సకాలంలో చెల్లించామని తెలియజేశారు. మిగిలిన మొత్తాన్ని సకాలంలో ఆయా రైతుల ఖాతాలకు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఇక ధాన్యం సేకరణలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6,42,894 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి 322 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ