తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటిలో ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన ఐటీ కారిడార్ను మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే దివిటిపల్లి సమీపంలోనే సుమారు 270 ఎకరాల్లో నిర్మించనున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వీటితో పాటు ఇంకా పలు అభివృద్ది పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల అనంతరం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ఉద్యమ సమయంలో తన ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. ఆయన సారథ్యంలో పూర్తి శాంతియుత మార్గంలో కొట్లాడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆయన ముఖ్యమంత్రిగా అహర్నిశలూ కష్టపడుతున్నాడు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం బాలన్స్ చేస్తూ రాష్ట్రాన్ని నేడు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు. అలాంటి కేసీఆర్ పట్ల సంస్కారం లేకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రెండు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ సీఎం కేసీఆర్ను గౌరవించకుండా నోటికొచ్చినట్టు నీచమైన మాటలు అంటున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తున్నందున రేవంత్ రెడ్డి మళ్ళీ జనంలోకి వస్తున్నాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్లలో 11 సార్లు అధికారం ఇచ్చారు. 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఒక్క మంచి పని కూడా చేయలేకపోయారు. మంచినీళ్లు, సాగునీరు, పరిశ్రమలు ఇలా ఏవీ కల్పించలేకపోయారు. బతుకుదెరువు కోసం కడుపు చేత పట్టుకుని ప్రజలు బయటి ప్రాంతాలకు వలస పోయేలా చేశారు. 55 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం చేయని వారు.. ఇప్పుడు ఇస్తే కొత్తగా చేస్తారా? అని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి’ అని మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE