కర్ణాటకలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఇరు పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం. ఇక ప్రచారంలో భాగంగా ఇరు పార్టీలలోని నేతలు ఒకరిపై ఒకరు అనేక ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ సందర్భంగా చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్కు, స్థానిక బీజేపీ నేతకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక ఆడియో క్లిప్ను కర్ణాటక ఇన్చార్జి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా విడుదల చేశారు. ఇందులో రాథోడ్, ఖర్గే భార్య పిల్లలను తుడిచిపెడతానని చెప్పినట్లుగా ఉంది. కాగా చిత్తాపూర్ నియోజకవర్గంలో మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేపై బీజేపీ నేత రాథోడ్ పోటీ చేస్తుండటం గమనార్హం. ఇక కాంగ్రెస్ ఆరోపణలతో కర్ణాటకలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీకి అర్థమైందని, అందుకే ఏఐసీసీ అధ్యక్షుడిని చంపేందుకు పథకం పన్నిందని రణ్దీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు. కర్ణాటకలో అభివృద్ధి దార్శనికతను ప్రదర్శించే బదులు, 40 శాతం అవినీతి (ఆరోపణలు)కి సమాధానం చెప్పకుండా, ఇప్పుడు వారు తమ చివరి ఆయుధంగా హత్యా కుట్రలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇదిలా ఉండగా మణికంఠ రాథోడ్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇటీవలే రాథోడ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో అది రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాథోడ్ మాట్లాడినట్లుగా ఆరోపిస్తున్న ఆడియో నెట్టింట కలకలం రేపుతోంది. కాగా ఈనెల 10వ తేదీన 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకేవిడతలో ఎన్నికలు జరుగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE