మహిళలు ఆర్ధికంగా స్వయం సమృద్ధి సాధించాలని, అప్పుడే ఆర్ధికంగా అభివృద్ధి సాధిస్తారని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం మరియు హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ (నిథమ్) ఇనిస్టిట్యూట్ లో మహిళలకు శిక్షణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్కో బృందానికి 30 నుండి 40 మంది చొప్పున 20 బృందాలుగా మొత్తం రాష్ట్రంలోని 600 మంది సంచార వాహనాలు, ప్రభుత్వం నుండి వివిధ పథకాల ద్వారా లబ్దిపొందిన మహిళలకు, మత్స్యరంగంలో ఔత్సాహికులకు, మహిళలకు, మత్స్య రైతులు, మత్స్య సహకార సంఘాలలోని సభ్యులకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందని, శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్ లను అందజేయడం జరుగుతుందని చెప్పారు.
నాణ్యతతో కూడిన రుచికరమైన చేపల వంటకాల తయారీ, స్టాల్స్ నిర్వహణ, ఆధునిక పద్దతులతో చేపల పెంపకం, మేలైన యాజమాన్య పద్దతులు తదితర అంశాలపై ఈ శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ నిర్వహించేందుకు గాను నిథమ్ ఇనిస్టిట్యూట్, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కో ఆపరేటివ్ మేనేజ్ మెంట్ (ఐసీఎం), తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ (టీఎస్సీయూ) సంస్థలతో మంత్రి శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హాల సమక్షంలో మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ఆయా సంస్థల ప్రతినిధులతో ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు.
మొదటి బృందం శిక్షణ కార్యక్రమం నేడు ప్రారంభం కాగా, మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన మహిళ లు పాల్గొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. మహిళలు వివిధ రకాల చేపల వంటకాల తయారీని నేర్చుకోవడానికి, పుడ్ కోర్ట్ ల నిర్వహణకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మృగశిర సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 7,8,9 తేదీలలో అన్ని జిల్లాలలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు చెప్పారు. కులవృత్తులపై ఆధారపడిన వారి జీవితాలలో వెలుగులు నింపాలని, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష్యం అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నీటి వనరులు అందుబాటులో ఉండటం, ప్రతి నీటి వనరులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో 2016-17 సంవత్సరంలో 1.97 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, ఇప్పుడు 3.90 లక్షల టన్నులకు పెరిగిందని, ఇది మత్స్యకారులు ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. సంపదను సృష్టించాలి, అది పేదలకు పంచాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు పెరిగిన మత్స్య సంపదను మత్స్యకారులకే అందించాలనే ఉద్దేశంతో మత్స్య సోసైటీలలో నూతనంగా 1.30 లక్షల మంది మత్స్యకారులకు సభ్యత్వం కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం దేశ విదేశాలకు చేపల ను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుంది:
18 సంవత్సరాలు నిండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి మత్స్యకారుడికి సభ్యత్వం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రం దేశ విదేశాలకు చేపల ను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మత్స్యకారులు చేపలను విక్రయించుకొనేందుకు గాను 65 వేల మోపెడ్ లు, ట్రాలీ ఆటోలు, ట్రక్కులు, వలలు, జాకెట్స్ వంటివి 900 కోట్ల రూపాయల వ్యయంతో పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చేపలు, చేపల వంటకాలు విక్రయాలు జరుపుకోవడానికి ఒకొక్కటి 10 లక్షల రూపాయల విలువైన 150 సంచార విక్రయ వాహనాలను 60 శాతం సబ్సిడీ పై అందించినట్లు చెప్పారు. ఈ వాహనాలను ఎక్కడికైనా తీసుకెళ్ళి చేపలు, వివిధ రకాల చేపల వంటకాలను విక్రయించుకోవచ్చని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో నిథమ్ డైరెక్టర్ లు డాక్టర్ చిన్నంరెడ్డి, కో ఆపరేటివ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ తంగిరాల, తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ ఎండి అరుణ, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE