బ్రెయిన్ డెడ్ అయి ఇతరులకు అవయవ దానం చేసిన పేద రైతు నర్సిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన పేద రైతు వరకాంతం నర్సిరెడ్డి ఈనెల 30న బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం దురదృష్టకరమన్నారు. అయినా సరే ఆపదలో ఉన్న ఇతరుల జీవితాలను నిలబెట్టడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి నర్సిరెడ్డి గుండెను దానం చేయడం గొప్ప విషయమని అన్నారు. వారి సేవాదృక్పథం అభినందనీయమన్నారు. తాను మరణిస్తూ ఐదుగురు జీవితాలను కాపాడిన నర్సిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు చరిత్రలో నిలుస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
వారి కుటుంబానికి నర్సిరెడ్డి లేని లోటు తీర్చలేనిదే అయినప్పటికీ ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేస్తామన్నారు. అలాగే వారి పిల్లల చదువులకు అయ్యే ఖర్చును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చేపట్టి వారు జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇలాంటి అనుకోని ఘటనలు జరిగినప్పుడు గుండె నిర్భరం చేసుకుని ఇతరుల జీవితాలను కాపాడేందుకు నర్సిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ముందుగా నర్సిరెడ్డి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. సంప్రదింపుల అనంతరం నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు మెట్రో స్టేషన్ వరకు మెట్రోరైలులో విజయవంతంగా గుండెను తరలించి అపోలో ఆసుపత్రిలో ఓ వ్యక్తికీ శస్త్రచికిత్స ద్వారా అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ