తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కు రంగం సిద్ధమవుతుంది. మునుగోడు ఉపఎన్నిక ప్రచార గడువు ఈ రోజు (నవంబర్ 1, మంగళవారం) సాయంత్రం 6 గంటలతో ముగిసింది. దాదాపు నెల రోజుల నుంచి మునుగోడులో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రజలతో మమేకమై తమ ప్రచారంతో హోరెత్తించారు. పార్టీల కీలక నేతల రోడ్ షోలు, ర్యాలీలతో మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా పెద్దఎత్తున సందడి నెలకుంది. తాజాగా ఉపఎన్నిక ప్రచార గడువు ముగియడంతో కొంత స్తబ్దత నెలకొననుంది. గడువు ముగిసిన వెంటనే ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులందరూ నియోజకవర్గాన్ని వీడాలని ఎన్నికల అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో, పలు ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొన్న అన్ని పార్టీల నేతలు తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు.
ముందుగా ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికకు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ పార్టీల కీలక నేతలు సహా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లుతో మునుగోడులో ప్రచారం సాగడంతో ఈ ఉపఎన్నికపై తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకుంది. మునుగోడులో నవంబర్ 3వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఎక్కువగా చర్చ జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ప్రజా తీర్పు ఎవరివైపు ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది.
మునుగోడు బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే:
- బీజేపీ – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- టీఆర్ఎస్ – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
- కాంగ్రెస్ – పాల్వాయి స్రవంతి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE