ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, పౌరసత్వసవరణ చట్టం(సీఏఏ) లకు వ్యతిరేకంగా యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, శుక్రవారం సాయంత్రం నిజామాబాద్లోని ఖిల్లా ఈద్గా వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వసవరణ చట్టం ఒక్క ముస్లింలకే వ్యతిరేకంకాదని, దేశంలో అన్ని వర్గాలకు నష్టమేనని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లు రాజ్యాంగానికి విరుద్ధమని, ఈ చట్టాలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ నాణేనికి బొమ్మ, బొరుసులాంటివని, అయితే మోదీ, అమిత్షాలు అవి వేర్వేరని అబద్ధాలు చెప్తున్నారని ఓవైసీ ధ్వజమెత్తారు.
తాను హిందువులకు వ్యతిరేకం కాదని, తన పౌరసత్వం అడిగే హక్కుమోదీకి లేదని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను మించిన లౌకికవాది మరొకరులేరని, టిఆర్ఎస్ సెక్యులర్ విధానాన్ని వదిలిపెట్టబోదని కేసీఆర్ తనకు చెప్పారని పేర్కొన్నారు. ఒకటే మతస్థులైన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. మోదీ మతాన్ని అందరిపై రుద్దాలని చూస్తుంటే, కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకెళ్తున్నారని చెప్పారు. ఈ బహిరంగ సభలో తెరాస ఎమ్మెల్యేలు నల్లమడుగు సురేందర్, షకీల్, జడ్పీ ఛైర్మన్ దాదన్న గారి విఠల్రావు, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజీబుద్దీన్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అలాగే ఎంఐఎం కార్యకర్తలు, టిఆర్ఎస్ కార్యకర్తలు,ఇతర ప్రజా సంఘాల నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు.
[subscribe]