గతేడాది చివర్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభమైంది. హామీల అమలుపై సర్కారు వెంటనే దృష్టి కేంద్రీకరించింది. పాలనను గాడిన పెట్టేందుకు బిజీబిజీగా గడుపుతోంది. కానీ.. ప్రజాతీర్పు వ్యతిరేకంగా రావడంతో విపక్షంలో కూర్చున్న బీఆర్ ఎస్ పార్టీ మాత్రం వినూత్న ప్రచారం మొదలుపెట్టే పనిలోనే నిమగ్నమైనట్లు కనిపించింది. రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తామని, సర్దుకునేందుకు సమయం పడుతుందని చెప్పిన బీఆర్ఎస్ పెద్దలు.. ఆరు రోజులు కూడా గడవకముందే విమర్శలు ప్రారంభించింది. అది ప్రభుత్వ వైఫల్యాలో.. హామీల అమలు కోసమో కాదు.. ఏకంగా ప్రభుత్వం కూలిపోతుందంటూ పార్టీలోని కొందరు ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు.
ఆ తరహా స్టేట్ మెంట్లు చేస్తోంది.. చోటామోటా నాయకులు కాదు.. ఏకంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నోట నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచీ అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ప్రొఫెసర్ కోదండరాం కీలక వాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దగ్గరున్న డబ్బుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకుని.. సంకెళ్లు తెగిపోయినంత స్వేచ్ఛగా ఉందన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరామ్కు సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాతే.. అసలైన తెలంగాణ ఏర్పడినట్లు ప్రజలు భావిస్తున్నారని కోదండరామ్ అన్నారు.
కోదండరామ్ లాంటి వ్యక్తి ఆ తరహా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయాల్లో తీవ్రదుమారం రేపుతోంది. వచ్చే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అంటూ ఇప్పటికే బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితోపాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడించింది. ప్రధానంగా బీఆరెస్స్ నేతలు ఇంత బలంగా చెబుతుండటం వెనుక కథ ఏమై ఉంటుందనే చర్చ బలంగా నడిచింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగానే… కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోయేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీఆరెస్స్, బీజేపీ ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తాజాగా ఆ తరహా వ్యాఖ్యలపై కోదండరాం ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో దీనిపై సీరియస్ గానే చర్చ నడుస్తోంది. నిజంగా బీఆర్ ఎస్ అధినేత ఆ ప్రయత్నాల్లో ఉన్నారా అనే చర్చ నడుస్తోంది. ఇతర పార్టీల నుంచి కూడా కేసీఆర్ మనుషులు పోటీ చేస్తున్నారని, వాళ్లు గెలిచిన వెంటనే బీఆర్ ఎస్ లో చేరతారని ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా సరిపడా మెజారిటీ రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సునాయాసంగా గద్దెనెక్కింది. అయినప్పటికీ.. త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా చూద్దామని.. తదితర కామెంట్లు బీఆర్ ఎస్ నుంచి వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటై కనీసం వంద రోజులు కాదు.. కదా.. గంటలు గడవక ముందే బీఆరెస్స్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటించడం దుమారం రేపుతోంది. అవును.. బీఆర్ ఎస్ అటువంటి ప్రయత్నాలు చేస్తోందంటూ.. కోదండరాం కూడా ఆరోపించడం ఆసక్తిగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE