తెలంగాణపై కాంగ్రెస్ నాయకత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈసారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇందుకోసం కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం వరుసగా తెలంగాణలో బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ సిద్ధమైంది. ఇక, సోనియా గాంధీ రంగంలోకి దిగుతున్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేశారు. మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు.
తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈసారి ఎన్నికల్లో అధికారమే కాంగ్రెస్ లక్ష్యంగా మారింది. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని భావిస్తోంది. ఈ సమయంలోనే ఆకర్షణీయ మేనిఫెస్టోతో పాటుగా సెంటిమెట్ అస్త్రాలను సంధించేందుకు సిద్ధమవుతోంది. సెంటిమెంటుతోపాటు ఆకర్షణీయ మేనిఫెస్టోతో తెలంగాణ ప్రజలను ఆకర్షించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటిమెంట్ను మరోసారి తెరపైకి తీసుకు రావడమే కాకుండా ఏకంగా అధినేత్రినే రంగంలోకి దింపాలని భావిస్తోంది. సెప్టెంబరు 17న రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తోంది.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆమెతో తెలంగాణ ప్రజలకు పిలుపు ఇప్పించనుంది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోనూ ఆ సభలోనే ప్రకటించాలని నిర్ణయించింది. అందులో భాగంగా, తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న సోనియా సభను ఏర్పాటు చేసి.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆమెతో పిలుపును ఇప్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గడిచిన రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం కేసీఆర్కు పని చేస్తే.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, సోనియా పిలుపుతో ఆ అస్త్రం ఈసారి కాంగ్రెస్ పార్టీకి వర్కవుట్ అవుతుందని అంచనా వేస్తోంది. ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోనూ ప్రకటించి క్షేత్రస్థాయి నుంచీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, పార్టీ మేనిఫెస్టోను ప్రతి గడపకూ చేరుస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలను ఆహ్వానించి మూడు భారీ సభలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబరు ఏడో తేదీ వరకూ ప్రియాంక గాంధీ షెడ్యూలు ఖాళీ లేకపోవడంతో ఈ లోపునే ఖర్గే, సిద్ధరామయ్య సభలను నిర్వహించాలని భావిస్తోంది. ఈనెల 18న తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఖర్గే సభను నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై చార్జ్షీట్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, బీసీ డిక్లరేషన్పైనా ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. సెప్టెంబరు 7 తర్వాత ప్రియాంక సభను ఏర్పాటు చేసి అందులో మహిళా డిక్లరేషన్ను ప్రకటించాలని నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE